పెన్పహాడ్, ఆగస్టు 22 : పెన్పహాడ్ మండలంలోని మాచారం గ్రామ శివారులోని శ్రీ సంతోషిమాత బిన్నీ రైస్మిల్లులో భారీగా ప్రభుత్వ ధాన్యం కొరత జరిగినట్లు రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. నల్లగొండ యూనిట్ అధికారులు సివిల్ సప్లై శాఖతో కలిసి నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో మొత్తం 8,078.818 మెట్రిక్ టన్నుల ధాన్యం కొరత ఉన్నట్లు తేలింది. ఖరీఫ్ 2024-25లో 1,931.746 మెట్రిక్ టన్నులు, రబీ 2025-26లో 4,277.458 మెట్రిక్ టన్నులు, రబీ 2022-23లో 1,869.614 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లుకు అప్పగించింది. అయితే తనిఖీల్లో మొత్తం ధాన్యం నిల్వల్లో భారీ వ్యత్యాసం గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కాగా ప్రభుత్వ ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ చేసి సీఎంఆర్ బియ్యం సరఫరా చేయాల్సి ఉండగా, ఇంత భారీ మొత్తంలో ధాన్యం కొరతపై సూర్యాపేట టీజీఎస్సీఎస్సీఎల్ జిల్లా మేనేజర్ ఉప్పల శ్రీధర్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఎన్. బాలు నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.