మఠంపల్లి, ఫిబ్రవరి 6 : సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో ఇనుప యుగపు ఆనవాళ్లు ఉన్నాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు అహోబిలం కరుణాకర్, నసీరుద్దీన్, చంటి ఇచ్చిన సమాచారం మేరకు గురువారం మఠంపల్లి పాత శివాలయం బజారులోని పీర్లచావిడి దగ్గర 12 అడుగుల ఎత్తు, 5 అడుగుల వెడల్పు, 6 అంగుళాల మందం ఉన్న నిలువురాయి(స్మారక శిల)ను పరిశీలించారు.
ఈ సందర్భంగా శివనాగిరెడ్డి మాట్లాడుతూ మఠంపల్లి క్రీస్తుపూర్వం వెయ్యి ఏండ్ల నాటి ఇనుపయుగపు స్థ్ధావరమన్నారు. ఆ కాలంలో మరణించిన వారిని ఒక గుంటలో పూడ్చి పైన మట్టితో కప్పి గుర్తుగా ఒక స్మారక శిలను నిలిపే ఆచారం ఉండేదని, అందులో భాగంగానే ఈ నిలువురాయిని ఇక్కడ ఏర్పాటు చేసి ఉండవచ్చని తెలిపారు. చారిత్రక ప్రాధాన్యం గల ఈ నిలువు రాయిని కాపాడుకోవాలని మఠంపల్లి గ్రామస్తులకు సూచించారు. పరిశోధనకు సహకరించిన బార్ కౌన్సిలర్ అధ్యక్షుడు, హైకోర్టు అడ్వకేట్ సాముల రామిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.