నల్లగొండ రూరల్, ఫిబ్రవరి 28 : ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 50 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి రోజు జరిగిన తెలుగు, సంస్కృతం పరీక్షకు జిల్లాలో 14,944 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 14,252 మంది హాజరయ్యారు. 692 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 12,714 మందికిగాను 12,235 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. 479 మంది గైర్హాజరయ్యారు.
ఒకేషనల్లో 2,230 మందికిగాను 2,017 మంది విద్యార్థులు హాజరు కాగా.. 213 మంది గైర్హాజరయ్యారు. ఒక నిమిషం ఆలస్యం నిబంధనతో పలువురు విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. జిల్లా కేంద్రంలోని కోమటిరెడ్డి ప్రతీక్రెడ్డి బాలుర జూనియర్ కళాశాలలో ఒకరు, హాలియాలో ముగ్గురు, మిర్యాలగూడలో ముగ్గురు, నాగార్జునసాగర్లో ఐదుగురు, దామరచర్లలో ఇద్దరు విద్యార్థులు ఆలస్యంగా వచ్చిన కారణంగా అధికారులు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించలేదు. ఈ క్రమంలో నిమిషం ఆలస్యం నిబంధనపై విద్యార్థులను పూర్తి స్థాయిలో చైతన్యం చేయడంలో అధికారులు విఫలమయ్యారని తల్లిదండ్రులు ఆరోపించారు.