యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ పరీక్షల్లో విద్యార్థులను పాస్ చేయించేందుకు కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అందినకాడికి దోచుకుం టూ జోరుగా మాస్ కాపీయింగ్ దందా కు తెరలేపారు. అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
ఆరు సబ్జెక్టులకు రూ.18వేలు
జిల్లాలోని ఓ మున్సిపాలిటీ పరిధిలో పైసలిస్తే పరీక్షల్లో పాస్ చేయించేందుకు కొందరు కొత్త అవతారం ఎత్తారు. బహిరంగంగానే విద్యార్థుల నుంచి డబ్బులు దండుకున్నారు. పరీక్షల్లో కచ్చితంగా పాస్ చేయిస్తామంటూ విద్యార్థుల నుంచి ఒక్కో సబ్జెక్టుకు రూ.3వేల చొప్పున వసూలు చేసినట్లు తెలిసింది. ఆరు సబ్జెక్టులకు కలిపి మొత్తం రూ. 18వేలు తీసుకున్నట్లు సమాచారం. ఈ డబ్బులతో ఓ టీంను ఏర్పాటు చేశారని, వారంతా పరీక్షా హాల్లో విద్యార్థులకు సహకరించేలా ప్లాన్ తయారు చేశారని విశ్వసనీయంగా తెలిసింది. కచ్చితంగా 35 మార్కులు లేదా ఆ పైన ఎక్కువగా వచ్చేలా మాస్ కాపీయింగ్కు సహకరిస్తారని అంటున్నారు.
అయితే ఈ విషయమై ఓ విద్యార్థి తండ్రిని డబ్బులు అడగ్గా.. ఆయన ఇచ్చేందుకు నిరాకరించడంతో విషయం బయటకు పొక్కింది. నేనెందుకు డబ్బులివ్వాలని ఆయన గట్టిగానే నిలదీసినట్లు సమాచారం. అయితే అవతలి వ్యక్తి సైతం తిప్పికొట్టారని, తమ దగ్గరికి చదివేందుకు సుదూర ప్రాంతాల నుంచి వస్తారని, తప్పకుండా పాస్ అయితామనే ధీమా ఉంటుందని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారని తెలిసింది. ఈ తతంగమంతా సంబంధిత అధికారులకు తెలిసే జరుగుతున్నదా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇదే విషయంపై జిల్లా నోడల్ ఆఫీసర్ రమణిని ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.
తొలి రోజు 263 మంది గైర్హాజర్..
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు సజావుగా జరిగాయి. బుధవారం ద్వితీయ భాష తెలుగు, హిందీ, సంస్కృత పరీక్షలు నిర్వహించారు. జనరల్తోపాటు ఒకేషనల్ కలిపి 6901 విద్యార్థులకు గానూ 6638 మంది హాజరు కాగా, 263 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో 28 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. హాల్లోకి ప్రవేశించేందుకు 5 నిమిషాలు గ్రేస్ పిరియడ్ను అనుమతిచ్చారు. గురువారం ఇంటర్ సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు.