మిర్యాలగూడ రూరల్, జనవరి 7:ఒకప్పుడు సన్న బియ్యం కొనలేని పేదలు కడుపు నింపుకోవడానికి పచ్చజొన్నలు ఆహారంగా తీసుకునేవారు. ఇప్పుడది తారుమారైంది. సన్న బియ్యం తింటే పడని సంపన్న వర్గాలవారు సైతం పచ్చ జొన్నలు వాడుతున్నారు. జొన్న అన్నం, రొట్టెలు (జొన్న ఉత్పత్తులను) ఎక్కువగా తింటున్నారు. దీంతోపాటు పంట సాగు తగ్గడంతో మార్కెట్లో పచ్చ జొన్నలకు గిరాకీ పెరిగింది. ఇప్పుడు జొన్నల ధర సన్న బియ్యం రేటు కన్నా రెట్టింపైంది.
చిరుధాన్యాల స్థానంలో వాణిజ్య పంటలు..
ఒకప్పుడు రైతులు తమకున్న భూమిలో కనీసం పావు వంతైనా చిరు ధాన్యాల పంటలు వేసేవారు. నీళ్లు, పెట్టుబడి అంతగా అవసరం ఉండకపోవడంతో చిరు ధాన్యాల సాగుకు రైతులు ఆసక్తి చూపేవారు. అయితే.. వాటికి ధర అంతగా ఉండకపోవడంతో రైతులకు పెద్దగా ఆదాయం వచ్చేదికాదు. ఆ తర్వాత నీటి వనరులు అందుబాటులోకి వచ్చినా కొద్ది రైతులు ఇతర పంటల వైపు మొగ్గు చూపారు. ముఖ్యంగా వరి పంటకు డిమాండ్ పెరుగడంతో జొన్న సాగుకు స్వస్తి చెప్పారు. అదేవిధంగా ఆరు తడి పంటలైన సజ్జ, రాగులు, తైదలు, కొర్రల స్థానంలో వాణిజ్య పంటల సాగు వైపు దృష్టి సారించారు. ఈ క్రమంలో పచ్చ జొన్న సాగు చాలా వరకు కనుమరుగైంది.
పచ్చ జొన్న సాగు పదుల ఎకరాల్లోనే..
మిర్యాలగూడ మండలంలో రెండు దశాబ్దాలకు ముందు తడకమళ్ల, తక్కెళ్ల పహాడ్, ముల్కలకాల్వ, జాలుబాయితండా, ఐలాపురం, కొత్తగూడెం, కొత్తపేట తండా, బి.అన్నారం, లావూడితండా, దుబ్బతండా, పొట్టెగానితండా, ధీరావత్ తండా, చిల్లాపురం, రుద్రారం, లక్ష్మీపురం, బల్లూ నాయక్తండా, కుంటకిందితండా, వాటర్ట్యాంకు తండా, కురియా తండా తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల్లో పచ్చ జొన్న సాగయ్యేది. ఇప్పుడు మచ్చుకు చూద్దామన్నా జొన్న పైరు కనిపిస్తలేదు. మండలంలో ఈ యాసంగి సీజన్లో కేవలం 10 ఎకరాలైనా జొన్న సాగు కాని పరిస్థితి.
పెరిగిన డిమాండ్, ధరలు
నేటి ఉరుకులు, పరుగుల జీవితంలో ఒత్తిళ్లకు లోనై అనేక మంది షుగర్, బీపీ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ క్రమంలో వైద్యుల సూచనల మేరకు జొన్న ఉత్పత్తుల వైపు దృష్టి సారిస్తున్నారు. వ్యాధి లేని వారు కూడా ముందు జాగ్రత్తగా జొన్న పదార్థాలను తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో జొన్నలకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో వాటి సాగు అంతగా లేకపోవడంతో నేడు మార్కెట్లో పచ్చ జొన్న బంగారమైంది. జొన్నల ధర కిలో రూ.75నుంచి రూ.85వరకు ఉండగా.. బియ్యం రేటు రూ.35 నుంచి రూ.45వరకు ఉన్నది. ఒకప్పుడు క్వింటా జొన్నలు అమ్మాలంటే నెలల సమయం పట్టేదని, ఇప్పుడు రెండు, మూడ్రోజుల్లోనే అమ్ముడు పోతున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు.
జొన్న రొట్టెలే తింటున్నాం
ఆరోగ్య రీత్యా, ముందు జాగ్రత్తగా వరి అన్నం ఒకపూట తింటున్నాం. రెండు పూటలా జొన్న ఉత్పత్తులు, రొట్టెలు అల్పాహారంగా తీసుకుంటున్నా. షుగర్ వ్యాధి ఉన్నవారు అధిక శాతం జొన్న ఉత్పత్తులను ఆహారంగా తీసుకుంటున్నారు. మార్కెట్లో జొన్నల ధర చూస్తే భయమేస్తుంది. అయినా తినక తప్పడం లేదు.
– కమలాకర్రెడ్డి, కిష్టాపురం, మిర్యాలగూడ మండలం
జొన్న ఉత్పత్తులను సూచిస్తున్నాం
రోజు రోజుకూ షుగర్ పేషెంట్ల సంఖ్య ఎక్కువవుతున్నది. దీంతో హాస్పిటల్కు వచ్చిన వారందరికీ జొన్న ఉత్పత్తులు ఆహారంగా తీసుకోవాలని సూచిస్తున్నాం. ఆరోగ రీత్యా ముందస్తుగా జొన్న ఉత్పత్తులు తినక తప్పదు. ఆరోగ్యం బాగుండాలంటే అల్పాహారంగా జొన్న, సజ్జ, రాగులు, తైదలు, వరిగలు వంటి చిరు ధాన్యాల ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవాలి.
– చింతల వనిత, వైద్యురాలు, మిర్యాలగూడ