నార్కట్పల్లి, డిసెంబర్ 12: దేశంలో అన్ని రాష్ర్టాల్లో విద్యుత్ కోతలు ఉన్నాయని, కోతలు లేకుండా 24గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణే అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. మండలంలోని అమ్మనబోలు గ్రామంలో రూ. 2 కోట్లతో నిర్మించిన 33/11కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగిస్తుంటే బీజేపీ నేతలు అడ్డుపడుతున్నారని అన్నారు. దేశంలో ప్రధాన నగరాలుగా చెప్పుకొనే చెన్నై, బెంగళూరు, కోల్కత్లాల్లో విద్యుత్ సమస్యలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో కరెంటు వెలుగులు ఆపడం ద్వారా అధికారంలోకి రావాలని మోదీ,కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఆరోపించారు. అమ్మనబోలు మండలం ఏర్పాటు ఎప్పుడో కావాలని మంత్రికి తెలియజేయగా ముఖ్యమంత్రి కేసీఆర్కు వివరించామని, అమ్మనబోలు మండలంగా ఏర్పడుతుందని ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, ఎంపీపీ నరేం దర్రెడ్డి, సర్పంచ్ బద్ద వరమ్మారాంరెడ్డి, ఎంపీటీసీ కొంపల్లి సైదులు, ఆయా గ్రామాల ఎంపీటీసీలు పుల్లెంల ముత్తయ్య, మేకల రాజిరెడ్డి, కనుకు అంజయ్య, ట్రాన్స్కో ఎస్ఈ చంద్రమోహన్, డీఈఈ శంకరయ్య, సత్యనారాయణ, చంద్రశేఖర్, జాన్రెడ్డి, సత్తయ్యగౌడ్, భరత్, మహేశ్ పాల్గొన్నారు.
ఇండోర్ స్టేడియం ఆధునీకరణ పనులు ప్రారంభం
నల్లగొండ రూరల్ : నల్లగొండలో ఇండోర్ స్టేడియం ఆధునీకరణ పనులను విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ. 2 కోట్లతో క్రీడాకారులకు అన్ని వసతులు ,సదుపాయాలు కల్పించే విధంగా స్టేడియాన్ని ఆధునీకరించినట్లు పేర్కొన్నారు. అనంతరం కాసేపు బాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ ఆడారు. కార్యక్రమంలోఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి , మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్గౌడ్, డీఏస్డీఓ మగ్బూల్ ఆహ్మద్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.