– మునుగోడులో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి నిర్వహణ
మునుగోడు, సెప్టెంబర్ 02 : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మళ్లీ వైఎస్ఆర్ రాజ్యం తీసుకొస్తామన్నారు. తన స్వగ్రామం నార్కట్పల్లి మండలం బ్రాహ్మణవెళ్లంలలో వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో రాజశేఖర్ రెడ్డికి లక్షలాది మంది అభిమానులు ఉన్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చినట్లు, వైఎస్ఆర్ ఆశయాల కోసం పాటుపడుతానని చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తాము వైఎస్సార్ శిష్యులం, తామ ఆయనను మరవం అని స్పష్టం చేశారు. తనను సీఎం.. సీఎం అంటున్నారు. ఆ టైం వస్తే బ్రహ్మదేవుడు కూడా ఆపలేడన్నారు. కొత్తవాళ్లు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కబ్జా చేయాలని చూస్తే రాజగోపాల్ రెడ్డి ఊరుకోడని హెచ్చరించారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరగనీయనన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే ఇతర పార్టీ నాయకులను తీసుకోవడం మంచిదే అయినప్పటికీ తమనే వెలగొడతాం అంటే ఊరుకోమన్నారు. రాబోయేది రాజశేఖర్ రెడ్డి యుగమేనన్నారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగితే వాళ్ల తరుపున రాజగోపాల్ రెడ్డి పోరాడుతాడని పేర్కొన్నారు.

మళ్లీ వైఎస్ఆర్ రాజ్యం తీసుకొస్తా : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి