నల్లగొండ, ఏప్రిల్ 8 : 85 సంవత్సరాలు నిండిన వృద్ధులు ఓటు హకును వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం హోమ్ ఓటింగ్ విధానం కల్పించినట్లు గానే, పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయలేని దివ్యాంగులకు హోమ్ ఓటింగ్ సదుపాయాన్ని కల్పించిందని నల్లగొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు ఓటు హకు ప్రాధాన్యతపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. 45 శాతానికి మించి వైకల్యం ఉన్న దివ్యాంగులు పోలింగ్ కేంద్రానికి రాలేని పరిస్థితుల్లో హోమ్ ఓటింగ్ విధానానికి సాక్షం యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, అలాగే ఫారం 12-డిలో సైతం దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.
జిల్లాలో ఉన్న దివ్యాంగ ఓటర్లు ఎన్నికల్లో ఓటు హకును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ట్రాన్స్జెండర్లు ఓటు వేయడమే కాకుండా, ఓటింగ్పై అవగాహన కల్పించే విధంగా కృషి చేయాలని కోరారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వీల్ చైర్లు, ర్యాంపులను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్రెడ్డి, గిరిజన సంక్షేమ అధికారి రాజ్కుమార్, ఐసీడీఎస్ పీడీ సకుబాయి, ట్రాన్స్జెండర్స్ నాయకురాలు నందిని తదితరులు పాల్గొన్నారు.