Link roads | బొడ్రాయిబజార్, ఏప్రిల్ 26 : ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా కావాల్సింది రహదారులు. ఈ రహదారులు అన్నివర్గాలకు అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా పట్టణాల విషయానికొస్తే చాలా వరకు ప్రజలు ఉద్యోగాలు, పిల్లల చదువుల రీత్యా పట్టణాలకు వలస వస్తుంటారు. వారం వారం తమ గ్రామానికి వెళ్లాలన్నా, తమ గ్రామం నుంచి ఎవరైనా ఇంటికి వచ్చినా అందుబాటులో ఉండేలా తమ ఊరి రోడ్డుకు దగ్గరగా ఇండ్లు అద్దెకు తీసుకొని నివాసముంటారు. సూర్యాపేట పట్టణ విషయానికి వస్తే జిల్లా కేంద్రం నుంచి ఏ గ్రామానికి వెళ్లాలన్నా జాతీయ రహదారి, బస్టాండ్లే ప్రధానం.
బస్టాండ్, జాతీయ రహదారిపైకి వెళ్లే ఏ ఊరికైనా సునాయసంగా వెళ్లొచ్చు. గతంలో పట్టణ శివారు ప్రాంతాలు చాలా వరకు జాతీయ రహదారికి, బస్టాండ్కు దూరంగా ఉండేవి. ఆయా ప్రాంతాల ప్రజలు ఏదైనా ఊరికి వెళ్లాలంటే బస్టాండ్, జాతీయ రహదారిపైకి కుటుంబంతో వాహనంపై రావాలంటే సుమారు అరగంట పైనే పట్టేది. మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి నిర్విరామంగా చేస్తున్న సూర్యాపేట అభివృద్ధిలో భాగంగా జిల్లా కేంద్రంలో పలు వార్డుల గుండా కొత్త రోడ్లు వెలిశాయి. ఈ రోడ్లతో ప్రజల కష్టాలు తీరడమే కాకుండా ఆయా ప్రాంతాల గుండా రాకపోకలను దగ్గర చేశాయి. గతంలో చుట్టూ తిరిగి జాతీయ రహదారిపైకి వెళ్లే వాహనాలు, ఇప్పుడు అంతర్గత రోడ్ల మీదుగా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా బస్టాండ్, హైవేకు చేరుకుంటున్నారు.
అంతర్గత రోడ్ల అభివృద్ధితో తగ్గిన అవస్థలు
సూర్యాపేట జిల్లా కేంద్రంలో గతంలో జనగాం క్రాస్రోడ్డుకు వెళ్లాలంటే కోర్టు చౌరస్తా మీదుగా ఎస్వీ డిగ్రీ కళాశాల నుంచి జనగాం బైపాస్కు చేరుకోవాల్సి వచ్చేది. ఇది దూరభారంతో కూడుకోవడమే కాకుండా తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమయ్యేది. మంత్రి జగదీశ్రెడ్డి సద్దుల చెరువును మినీ ట్యాంక్బండ్గా మార్చి ట్యాంక్బండ్ పక్క నుంచి సుమారు 2 కోట్ల నిధులతో సీసీ రోడ్డు నిర్మించడంతో ఇది నేరుగా జనగాం బైపాస్కు చేరుతుంది. జనగాం బైపాస్కు వెళ్లే వారు చాలా వరకు ఈ రహదారినే ఆశ్రయిస్తున్నారు. అలాగే అంబేద్కర్నగర్, చింతల చెరువు ప్రాంతాలకు చెందిన ప్రజలు ఖమ్మం రోడ్డుకు వెళ్లాలంటే 65వ నంబర్ జాతీయ రహదారికి వచ్చి అక్కడి నుంచి ఖమ్మం క్రాస్రోడ్కు చేరుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం ఈ ప్రాంతం నుంచి మినీ బైపాస్ పడడంతో ఈ ప్రాంతాల ప్రజలు నేరుగా ఖమ్మం రోడ్డుకు చేరుతున్నారు. పొట్టి శ్రీరాములు సెంటర్ నుంచి జాతీయ రహదారిపైకి వెళ్లాలంటే జమ్మిగడ్డ మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం జమ్మిగడ్డ నుంచి జాతీయ రహదారిపైకి రోడ్డు రావడంతో చుట్టూ తిరిగే పని లేకుండా నేరుగా హైవేకు చేరుతున్నారు. అలాగే జాతీయ రహదారి నుంచి నూతన కలెక్టరేట్ వరకు వేసిన బీటీ రోడ్డుతో ఆయా ప్రాంతాల ప్రజలు చుట్టూ తిరిగే పని లేకుండా నేరుగా హైవేకు చేరుతున్నారు. పట్టణాభివృద్ధిలో భాగంగా ఆయా ప్రాంతాల్లో వెలసిన అంతర్గత రహదారుల నుంచి ప్రధాన రహదారులకు వెళ్లేందుకు ఆయా ప్రాంతాలను బట్టి అర కిలో మీటరు నుంచి కిలో మీటరు వరకు దూరం తగ్గడంతోపాటు సమయం ఆదా అవుతుండడంతో వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అన్ని వార్డుల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధి
మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సహకారంతో జిల్లా కేంద్రంలోని అన్ని వార్డుల్లో అంతర్గత రోడ్లను పూర్తిగా అభివృద్ధి చేస్తున్నాం. ఈ రోడ్లతో ప్రజల దూరభారం ఇబ్బందులు తీరాయనడంలో సందేహం లేదు. ఏ పని చేసినా ప్రజల కోసమే చేస్తుండడంతో ప్రజలంతా పట్టణాభివృద్ధిలో భాగస్వాములు కావాలి.
–పెరుమాళ్ల అన్నపూర్ణ, మున్సిపల్ చైర్పర్సన్, సూర్యాపేట
గతంలో చుట్టూ తిరుగాల్సి వచ్చేది
మాది పట్టణంలోని అన్నాదురైనగర్. మేము జనగాం రోడ్డుకు వెళ్లాలంటే గతంలో కోర్టు చౌరస్తా మీదుగా వెళ్లేవాళ్లం. ఇప్పుడు మా ప్రాంతంలోని సద్దుల చెరువు మినీ ట్యాంక్బండ్గా మారడంతో మంత్రి జగదీశ్రెడ్డి దాని వెంట సీసీ రోడ్డు వేయించారు. ఈ రోడ్డు నేరుగా జనగాం క్రాస్రోడ్కు చేరుతుంది. ఇప్పుడు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పోయింది.
– రామగిరి సురేశ్, అన్నాదురైనగర్, సూర్యాపేట