త్రిపురారం, డిసెంబర్ 25 : మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా వరిసాగులో నీటి సామర్థ్య యాజమాన్య పద్ధతులు పాటించడం ఎంతో అవసరమని, మిథేన్ కాలుష్య నివారణకు తడి- పొడి సాగు విధానం అవసరమని కేవీకే కంపసాగర్ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. జిల్లాలో వరి పంటలో తడి-పొడి సాగు విధానంపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తక్కువ నీటితో ఎక్కువ ఉత్పాదకత సాధించే తడి-పొడి విధానం అమలు పద్ధతిపై మండలంలోని కంపసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం సేద్యపు విభాగం శాస్త్రవేత్త డాక్టర్ భరత్ మాటల్లో…
వరి నాటు వేసిన 1-2 వారాల తర్వాత..
వరి నాటు వేసిన కొన్ని రోజుల తర్వాత అనగా 1 నుంచి 2 వారాల తర్వాత తడి-పొడి సాగు పద్ధతి పాటించాలి. కలుపు ఎక్కువగా ఉంటే కలుపు నివారణ తర్వాత పాటించాలి. పొలంలో 5 సెంటిమీటర్లు పైకి వచ్చే విధంగా నీటి తడి అందించాలి. తర్వాత క్రమంగా నీటిమట్టం తగ్గుతూ ఉంటుంది. అనంతరం పొలం వెంట్రుక మందం చీలిపోయినట్లు కనిపించిన తర్వాత మళ్లీ తడి ఇవ్వాలి. అయితే పంటపూత దశలో నీరు 5 సెంటిమీటర్ల వరకూ నీరు నిలబడేలా చూసుకోవాలి. పూత దశ తర్వాత వరి గింజలు పాలు పోసుకునే దశలో, అలాగే కోతకు ముందు నీరు భూమి లోపల 5 సెంటిమీటర్లకు వెళ్లే వరకూ తిరిగి నీటిని పెట్టాల్సిన అవసరం లేదు.
పొలంలో అమర్చుకునే నీటి గొట్టం నిర్మాణ పద్ధతి
తడి-పొడి సాగు పద్ధతిలో రంధ్రాలున్న ప్లాస్టిక్ గొట్టాన్ని ఉపయోగించి పొలంలో ఉన్న నీటి మోతాదును గుర్తించి అవసరమైన నీటిని అందిం చాలి. ఇందుకోసం రైతులు ముందుగా అడుగు పొడవు 6 అంగుళాల వ్యాసం ఉండే గొట్టాన్ని తీసుకోవాలి. గొట్టం అడుగుభాగం నుంచి సగం ఎత్తు వరకు చుట్టూ రంధ్రాలు 0.5 సె.మీ. పరిమాణంలో ఉండేలా తయారు చేసుకోవాలి. రెండు రంధ్రాల మధ్య 2 సెంటిమీటర్ల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనిని అరడుగు లోతు వరకు భూమి లోపలికి దించుకోవాలి. గొట్టం లోపల మట్టిని తీసివేయాలి. గొట్టం రంధ్రాల గుండా నీరు లోపలికి ప్రవహించి ఇలా అమర్చిన గొట్టం నీటిమట్టాన్ని సూచిస్తుంది. ఈ గొట్టాన్ని పొలంలో గట్లకు దగ్గరగా అమర్చుకోవడం వల్ల రోజూ చూసుకోవడానికి సులువుగా ఉంటుంది.
రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు :
చౌడు నేలల్లో తడి-పొడి సాగు విధానం పాటించకూడదు.
నీటిగొట్టం అమర్చేటప్పుడు నాగటి సాలు కింద గట్టి పొర పాడవకుండా జాగ్రత్తగా అమర్చుకోవాలి.
నీటిగొట్టంలోని మట్టిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి.
వరి పంట కంకి ఏర్పడే సమయంలో 10 రోజుల వరకు సాధారణ పద్ధతి మాదిరిగానే నీటిని పెట్టుకోవాలి.
ఈ విధానంతో కలిగే ప్రయోజనాలు :
మిథేన్ కాలుష్య కారకం విడుదల తగ్గుతుంది.
హైడ్రోజన్ సల్ఫ్రైడ్ వల్ల వరి పంటకు హాని కలగకుండా ఉంటుంది.
15 నుంచి 30 శాతం నీటి వినియోగం తగ్గడంతోపాటు, పంట వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెంది చీడపీడలు, దోమ ఉధృతిని తట్టుకుంటుంది.
చేను భూమిపై పడకుండా ఉంటుంది.
నేల భౌతిక పరిస్థితులు మెరుగుపడడమే కాకుండా యంత్రాలతో కోతకు అనుకూల పరిస్థితులుంటాయి.
మెరుగైన నీటి యాజమాన్య పద్ధతులు ఉపయోగించడం వల్ల గ్రీన్హౌజ్ మార్కెట్లో ఆదాయం వస్తుంది.