హాలియా, నవంబర్ 29 : మహిళా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. అనుముల మండలంలోని 90 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంగళవారం హాలియాలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడబిడ్డ పెండ్లి తల్లిదండ్రులకు భారం కావద్దనే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవన్నారు. అందుకే దేశ ప్రజలంతా సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్చైర్మన్ ఇరిగి పెద్దిలు, మున్సిపల్ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మాశంకరయ్య, తాసీల్దార్ లావూరి మంగ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు చేరుపల్లి ముత్యాలు, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
నియోజకవర్గస్థాయి కబడ్డీ పోటీలు
హాలియా : దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య జ్ఞాపకార్ధం టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో హాలియాలో నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి కబడ్డీ పోటీలను మంగళవారం ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నర్సింహయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులతో కలసి ఎమ్మెల్యే కబడ్డీ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోముల నర్సింహయ్య పేదల పక్షపాతిగా ఉండేవారని, అందుకే ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఆయన ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకలు మల్గిరెడ్డి లింగారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నల్లగొండ సుధకర్, కౌన్సిలర్లు వర్రా వెంకట్రెడ్డి, ప్రసాద్నాయక్, శ్రీనువాస్, ఎన్నమల్ల సత్యం, చల్ల మట్టారెడ్డి, దోరేపల్లి వెంకటేశ్వర్లు, సురభి రాంబాబు, టీఆర్ఎస్వీ నియోజకవర్గ ఇన్చార్జి పిల్లి అభినయ్, వెంకట్, హుస్సేన్ పాల్గొన్నారు.