అర్వపల్లిలోని హజ్రత్ సయ్యద్ ఖాజా నసీరుద్దీన్ బాబా ఉర్సు ప్రారంభమైంది. రెండు రోజుల ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం గంధోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అర్వపల్లి పోలీస్ స్టేషన్ నుంచి దర్గా వరకు గంధం ఊరేగింపు చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు
చెల్లించుకున్నారు. పకీర్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
అర్వపల్లి, డిసెంబర్ 8 : మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రం సమీపంలోని హజ్రత్ సయ్యద్ ఖాజా నసీరుద్దీన్బాబా దర్గా ఉర్సు ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభ మయ్యాయి. ఉత్సవాలకు ఉమ్మడి నల్లగొండ జిల్లాతో ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో దర్గా పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. అర్వపల్లి పోలీస్స్టేషన్ నుంచి దర్గా వరకు గంధం ఊరేగింపు వైభవంగా సాగింది.
డీఎస్పీ నాగభూషణం, ఎంపీపీ మన్నె రేణుకాలక్ష్మీనర్సయ్యయాదవ్, వక్స్బోర్డు ఇన్స్పెక్టర్ మహమూద్ గంధం ఊరేగింపును ప్రారంభించారు. ఈ సందర్భంగా పక్కీరుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. గంధాన్ని దర్గాలోకి తీసుకొచ్చిన అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉర్సు సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వ్యాపారులు దర్గా ఆవరణలో దుకాణాలను ఏర్పాటు చేవారు. రాష్ట్రం నలుమూలల నుంచి హిందూ, ముస్లింలు వేలాదిగా తరలివచ్చారు. భక్తుల రద్దీకి అనుగుణంగా వక్ఫ్బోర్డ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు.
పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 75 మంది పోలీసులు, ఎస్ఐలు, ఏఎస్ఐలు బందోబస్తులో పాల్గొంటున్నట్లు ఎస్ఐ అంజిరెడ్డి తెలిపారు. ఉర్సును ప్రశాంతంగా నిర్వహించేందుకు భక్తులు, నిర్వాహకులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సీఐలు శివశంకర్, బ్రహ్మమురారి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు దరూరి యోగానందచార్యులు, ముజావర్ సయ్యద్ అలి, మండల కోఆప్షన్ సభ్యుడు హమీద్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిరెడ్డి రాజేందర్రెడ్డి, మోరపాక సత్యం, నర్సింగ్ శ్రీనివాస్, వేల్పుల రమేశ్ పాల్గొన్నారు.