కసి ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగం..
నిరంతర శ్రమ, చిత్తశుద్ధితోపాటు సాధించాలన్న కసితో ముందుకు సాగితేనే ప్రభుత్వ ఉద్యోగం సాధ్యమవుతుంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులందరూ ప్రతి అంశాన్నీ విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలలి. విద్యార్థులంతా భయాన్ని వీడి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. సూర్యుడు ఉదయించడం కంటే ఎవరు ముందు నిద్రలేస్తారో వారే విజయం సాధిస్తారు. అభ్యర్థులు ఈ విషయాన్ని నిరంతరం గుర్తు పెట్టుకోవాలి. ఓటమి గురించి ఆలోచించకుండా నిరంతరం గెలుపు నామస్మరణ చేయాలి. నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ముఖ్యం కాదు. అందులో ఒక పోస్టు తనదేనన్న ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. సంకల్పబలం ఉంటే ఉద్యోగం సలాం కొడుతుంది. ప్రభుత్వం వెలువరిస్తున్న నోటిఫికేషన్లతో ఎలాగైనా ఉద్యోగం సాధించాలంటే అందుకు శిక్షణ కూడా ఎంతో అవసరం.
–గంపా నాగేశ్వరరావు, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు
నేనూ మీ నుంచే వచ్చా..
నేనూ మీ నుంచే వచ్చా. ఎస్ఐ ఉద్యోగానికి ప్రిపేరయ్యా. రాత పరీక్ష ఉత్తీర్ణుడినయ్యా. ఫిజికల్గా ఫిట్గా లేనన్నారు. ఆరో ప్రయత్నంలో సివిల్స్ సాధించా. ఐపీఎస్ శిక్షణలో అన్ని రకాల మెడల్స్ సొంతం చేసుకున్నా. నేను ఎంత ఫిట్గా ఉన్నానో అనేందుకు ఇదే ఉదాహరణ. అంత కసిగా ఉండాలి. అపజయాల నుంచి విజయాలు సాధించాలి. కొందరికి త్వరగా సక్సెస్ వస్తుంది. కొందరికి ఆలస్యంగా వస్తుంది. కానీ ప్రయత్నం చేస్తుంటే ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే అన్నీ తెలియాల్సిన అవసరం లేదు. ముందుగా సిలబస్ను సిద్ధం చేసుకుని మనతో పోటీ పడేవారికి అనుగుణంగా సన్నద్ధమవ్వాలి. ప్రతి సబ్జెక్టుకూ ఎంత టైమ్ పడుతుందో అంచనా వేసుకోవాలి. అవగాహన లేని సబ్జెక్టులకు ఎక్కువ సమయం కేటాయించాలి.
–సిరిశెట్టి సంకీర్త్, ఖమ్మం ఏఎస్పీ
కఠిన శ్రమే విజయానికి మంత్రం..
పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని ప్రతి ఒక్కరికీ ఆశ ఉంటుంది. సివిల్స్ మొదలుకుని గ్రూప్స్, పోలీస్ ఉద్యోగాల వరకూ ఏదో ఒక జాబ్ తెచ్చుకోవాలనే కల ఉంటుంది. ఆ కలను, ఆ ఆశను నిజం చేసుకోవాలంటే దగ్గరి దారులు ఏమీ ఉండవు. కఠిన శ్రమే విజయానికి మంత్రం. సక్సెస్ ఎక్కడో ఉండదు. మనలోనే ఉంటుంది. మనోబలంతోనే దానిని సాధించాలి. రాష్ట్ర ప్రభుత్వం భారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. వాటిల్లో విజయం సాధించాలంటే ఎలా చదవాలో ఒక ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకోవాలి. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, తెలంగాణ ఆర్థిక విషయాలు, భౌగోళిక అంశాలు, సామాజిక స్ధితిగతులు, తెలంగాణ ఉద్యమం వంటి వాటి గురించి తెలిసి ఉండాలి. వాటి గురించి లోతుగా అధ్యయనం చేయాలి. రాష్ట్రస్థాయి పోటీ పరీక్షల్లో పోటీ పడే అభ్యర్థులు రాష్ర్టానికి చెందిన అంశాలపైనే ఎక్కువగా దృష్టిపెట్టాలి. –మల్లవరపు బాలలత,
సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్
ఆత్మవిశ్వాసంతోనే సాధించగలరు..
సబ్జెక్టును చదవడంలో చాలామందికి ఆత్మవిశ్వాసం ఉండదు. ఆత్మన్యూనత నుంచి ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి కృషిచేయాలి. మీరు పడే కష్టానికి తప్పకుండా ఫలితం ఉంటుంది. ఇన్ని వేల ఉద్యోగాల్లో ఏదో ఒక ఉద్యోగం సాధించడం ఖాయం. అకాడమీ పరీక్షలకు, పోటీ పరీక్షలకు చాలా తేడా ఉంటుంది. అకాడమీ పరీక్షల్లో అర మార్కును చూసీ చూడనట్లు వేస్తారు. కానీ.. పోటీ పరీక్షలో ఎక్కడ అర మార్కు తప్పు చేశాడో అని చూసి కొట్టి పడేస్తారు. సక్సెస్ కోసం బ్లూప్రింట్ అవసరం. ప్రతి ఒక్కరూ బ్లూప్రింట్ స్ట్రాటజీని తయారు చేసుకోవాలి. ప్రిపరేషన్ కోసం నాలెడ్జ్, స్కిల్స్తోపాటు ఫిజికల్గా సంసిద్ధులై ఉండాలి. మానసికంగా దృఢంగా ఉండాలి. ఈ ఉద్యోగం నేను సాధిస్తానన్న నమ్మకం గట్టిగా ఉండాలి. కొత్త విషయాలు నేర్చుకున్నప్పడు, చదివినప్పుడు కొంత సమయం మాత్రమే గుర్తుంటాయి. మరిచిపోకుండా ఉండాలంటే చదివిన విషయాలు నోట్ చేసుకోవాలి. ప్రతి విషయాన్ని విజువలైజేషన్ చేసుకోవాలి. ఒక స్క్రిప్ట్ ప్రకారం మననం చేయాలి. నిద్ర నుంచి లేచిన తర్వాత చదివిన విషయాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి. చదివిన ప్రతి విషయాన్ని నోట్ చేసుకోవాలి. లక్ష్యం పెట్టుకుని సాధన చేయాలి. అప్పుడే ఉద్యోగం సాధించగలరు.
–డాక్టర్ సీఎస్ వేప, వేప అకాడమీ ఆఫ్ హైదరాబాద్ డైరెక్టర్
జిల్లాలో 1,200 మందికి ఉద్యాగాలు కల్పించాం..
మా వద్ద పొందిన శిక్షణ వల్ల జిల్లా నుంచి 1,200 మందికి ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్స్ వంటి ఉద్యోగాలు లభించాయి. పోటీ పరీక్షలకు ప్రత్యక్ష శిక్షణతోపాటు ఆన్లైన్ శిక్షణ కోసం లెజెండరీ ఫ్యాకల్టీతో ఆర్సీ ఎగ్జామ్స్ మొబైల్ యాప్ను అందుబాటులో తీసుకొచ్చాం. కరోనా సమయంలో ఎందరో అభ్యర్థులు వీటిని వినియోగించుకొని ఇంటి వద్దనే సన్నద్ధమయ్యారు. రెండు తెలుగు రాష్ర్టాల్లో 20 ఏళ్లుగా లక్షలాది మంది విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన అపార అనుభవం ఉన్న సివిల్స్, గ్రూప్స్ ఫ్యాకల్టీ పాఠాలు ఆర్సీ ఎగ్జామ్స్ యాప్లో ఉన్నాయి.
–మెండెం కిరణ్కుమార్, రైట్ చాయిస్ అకాడమీ చైర్మన్
సామాజిక బాధ్యతతోనే సదస్సులు..
ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్లలో పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. పోటీ పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం ‘నిపుణ’ పేరుతో నిపుణుల అభిప్రాయాలను, మెటీరియల్ను అందిస్తున్నాం. అంతటితో ఆగకుండా రాష్ట్రంలోని యువతీ యువకులకు ఉద్యోగాలు రావాలనే తలంపుతో సామాజిక బాధ్యతను తీసుకున్నాం. పోటీ పరీక్షల అభ్యర్థులకు ఉండే సందేహాలు తీర్చేందుకు, అనుమానాలు నివృత్తి చేసేందుకు జిల్లాల్లో ఉచిత అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. గతంలో ఇంటర్నెట్ వంటివి లేక విషయ సమాచారం తక్కువగా ఉండేది. ఇప్పటి జనరేషన్ అభ్యర్థులు చాలా అదృష్టవంతులు. అన్ని అరచేతిలోనే ఉన్నాయి. ఇలాంటి సదస్సుల్లో నిపుణులు చెప్పే విషయాలు నోట్ చేసుకొని సన్నద్ధమవ్వాలి.
–ఎస్జీవీ శ్రీనివాసరావు, నమస్తే తెలంగాణ నెట్వర్క్ ఇన్చార్జి