రాజాపేట, ఏప్రిల్ 19 : మండలంలోని సింగారం, జాల, కొత్తజాల గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం భారీ ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. దాంతో ధాన్యం నేలరాలి చేలు నేల వాలాయి. భారీ ఈదురుగాలులకు మామిడి కాయలు రాలాయి. రేకుల కొట్టాలు ఎగిరిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. అకాల వడగడ్ల వానతో అపార నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. సుమారు 60 ఎకరాల్లో వరి ధాన్యంతోపాటు మామిడి తోటలు దెబ్బతిన్నాయని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.
అకాల వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని జాలలో వడగండ్ల వర్షంతో దెబ్బతిన్న వరి పొలాలతోపాటు నేల రాలిన మామిడి, ఎగిరిపడిన కొట్టాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అకాల వర్షంతో అన్నదాతలకు అపార నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆమె వెంట ఎంపీపీ గోపగాని బాలమణీయాదగిరిగౌడ్, బీఆర్ఎస్ మహిళాధ్యక్షురాలు ఎడ్ల బాలలక్ష్మి, మాజీ సర్పంచ్ గుంటి మధుసూదన్రెడ్డి, మదర్ డెయిరీ డైరెక్టర్ గొల్లపల్లి రాంరెడ్డి, బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ సందిల భాస్కర్గౌడ్, ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మర్ల నాగరాజు పాల్గొన్నారు.