భువి నుంచి ఉబికివస్తున్న గంగమ్మ
జిల్లాలో పెరుగుతున్న భూగర్భ జలాలు
ఐదేండ్లలో 4.5 మీటర్ల మేర పెరుగుదల
భూదాన్పోచంపల్లిలో 5మీటర్లలోనే..
పాతాళం వీడి పైపైకి గంగమ్మ ఉబికివస్తున్నది. సర్కారు కృషికి వరుణుడి కరుణ తోడవడంతో జిల్లాలో భూగర్భ జల మట్టం గణనీయంగా పెరుగుతున్నది. ఐదేండ్లలో 4.56 మీటర్ల మేర నీళ్లు పైకొచ్చాయి. గతేడాదితో పోలిస్తే ఈ జూన్లో ఇంకో అర మీటరు వరకు చేరువయ్యాయి. జిల్లావ్యాప్తంగా 11 మండలాల్లో ఈ మార్పు ఉంది. వానలు-వరదలతో చెరువులు, కుంటలు నిండి అక్కడక్కడా బోరుబావుల్లో నీళ్లు పైకి ఎగదన్నుతున్నాయి. సంస్థాన్నారాయణపురంలో అత్యధికంగా 4.9 మీటర్లు పైకి భూగర్భ జల మట్టం పెరిగింది. కాగా, భూదాన్పోచంపల్లిలో 5.05 మీటర్లు, చౌటుప్పల్లో 5.3 మీటర్లలోనే నీటి నిల్వలు ఉన్నట్లు అధికారులు స్పష్టంచేశారు.
యాదాద్రి భువనగిరి, జూలై 14 (నమస్తే తెలంగాణ) : పాతాళగంగ ఉబికి వచ్చింది. ప్రభుత్వ కృషికి తోడు వర్షాలు సమృద్ధిగా కురువడంతో జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. ఐదేండ్లలో 4.56మీటర్ల మేర జలాలు పైకొచ్చాయి. గతేడాదితో పోలిస్తే ఈ సారి జూన్లో అర మీటరు మేర జలాలు ఉబికివచ్చాయి. వరుస వానలతో చెరువులు, కుంటలు నిండడం.. బోర్లు, బావుల్లో సమృద్ధిగా నీరు ఉండటంతో పంటలకు ఢోకా లేదని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నారాయణపురంలో 4.9 మీటర్లు పైపైకి..
ఈ ఏడాది జూన్లో జిల్లాలో భూగర్భ జలాల సగటు 7.72 మీటర్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయానికి 8.27మీటర్లు ఉంది. అంటే ఈ సారి 0.55 మీటర్ల మేర భూగర్భ జలాలు పైకి వచ్చాయి. జిల్లాలోని 11మండలాల్లో భూగర్భ జలాలు పెరిగాయి. ఆరు మండలాల్లో కాస్త తగ్గాయి. అత్యధికంగా సంస్థాన్ నారాయణపురం మండలంలో 4.9 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి. ఆ తర్వాత మోటకొండూరులో 3.3, ఆలేరులో 3 మీటర్ల మేర జలాలు ఉబికివచ్చాయి. భూదాన్ పోచంపల్లిలో 5.05, చౌటుప్పల్లో 5.3 మీటర్ల సరాసరి దూరంలో నీటి నిల్వలు ఉన్నాయి. ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ, తదితర కార్యక్రమాలతోపాటు వరుసగా కురుస్తున్న వర్షాలతో భూగర్భ జలాలు పెరుగుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
తాగు, సాగునీటికి ఢోకా లేనట్టే..
చెరువులు, కుంటలు నిండుకుండలా ఉండటం.. భూగర్భ జలాలు పెరుగడంతో తాగు, సాగునీటికి ఎలాంటి ఢోకా ఉండదని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో రైతులు బోర్లు, చెరువుల ఆధారంగా వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. వాటికి నీటి లభ్యత చాలా అవసరం. నీళ్లు పుష్కలంగా ఉండటంతో రైతన్నలు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
83శాతం అధిక వానలు..
జిల్లాలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. జూన్ నెలతోపాటు వారం రోజులుగా కురుస్తున్న వానలతో జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో సాధారణం కంటే సగటున 83శాతం అధికంగా వర్షాలు కురిశాయి. 170.3 మి.మీ. సాధారణ వర్షపాతం అంచనా వేయగా అంతకుమించి 312 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాలోని అన్ని మండలాల్లో మిగులు వర్షపాతం రికార్డయ్యింది. గతేడాదితో పోలిస్తే ఈ సారి 10శాతం అధికంగా వానలు పడ్డాయి. గుండాల మండలంలో 153శాతం, అడ్డగూడూరులో 147, మోత్కూరులో 101శాతం ఎక్కువగా వర్షాలు పడ్డాయి.