భూగర్భంలో ఏ ప్రాంతంలో ఎంత నీరుంది.. అందులో వాడుకోదగినది ఎంత? బోర్ల తవ్వకాలు ఎక్కడ చేపట్టవచ్చు.. ఎక్కడ నిషేధించాలి? వంటి అంశాలను భూగర్భ జల వనరుల శాఖ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నది. ఆ శాఖ సిబ్బంది నెలకోసారి మండలాల్లో బిగించిన పరికరాల వద్దకు వెళ్లి కొలతలు తీసుకుని నీటి మట్టం నమోదు చేస్తున్నది. అయితే.. ఈ లెక్కల్లో కొంత వ్యత్యాసం ఉంటుండడం, సిబ్బంది దూర ప్రాంతాలకు సరిగ్గా వెళ్లకపోవడంతో తేడాలు వస్తున్నాయి. ఈ క్రమంలో జల మట్టం లెక్కల్లో కచ్చితత్వం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. పిజోమీటర్లో ఆటోమెటిక్ డిజటల్ వాటర్ లెవల్ రికార్డు అనే పరికరాన్ని బిగించారు. ఈ విధానంతో ప్రతి ఆరు గంటలకోసారి నీటి మట్టం ఆన్లైన్లో నిక్షిప్తమవుతున్నది. ఈ నివేదికలు గృహ,
వ్యవసాయ, పారిశ్రామిక అవసరాల కోసం బోరుబావులు తవ్వడానికి అనుమతి ఇవ్వడంలో కీలకం కానున్నాయి.
నల్లగొండ జిల్లాలో 82 పిజోమీటర్లు
నల్లగొండ జిల్లాలో ఇప్పటికే 82 పిజోమీట్లర ద్వారా నీటి మట్టాలను సేకరిస్తున్నారు. దీనికితోడు నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టులో (ఎన్హెచ్సీ) భాగంగా పిజోమీటర్లు లేని ప్రాంతాల్లో మరో 58 ఏర్పాటు కానున్నాయి. ఇందులో భాగంగా చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి వద్ద పిజోమీటర్ల ఏర్పాటుకు ఇటీవల డ్రిల్లింగ్ పనులను ప్రారంభించారు.
ఆరు గంటలకోసారి నిక్షిప్తం
భూగర్భ జలాల లభ్యతపై కచ్చితమైన లెక్కల కోసం నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టులో భాగంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టారు. పిజోమీటర్ (డిజటల్ వాటర్ లెవల్ రికార్డు) పరికరాల సెన్సార్ను కేబుల్ సాయంతో టెలీమెట్రిక్కు అనుసంధానం చేస్తారు. నీటి హెచ్చుతగ్గులను సెన్సార్ గుర్తించి ఎప్పటికప్పుడు టెలీమెట్రిక్కు అందిస్తుంది. ఈ విధానంతో అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లకుండానే కార్యాలయం నుంచి జల మట్టాన్ని తెలుసుకోవచ్చు. ప్రతి ఆరు గంటలకోసారి సంక్లిప్త సందేశం రావడం ద్వారా కచ్చితమైన వివరాలు తెలుస్తాయి.
పటిష్టంకానున్న వాల్టా చట్టం
గ్రామాలు, పట్టణాల్లో నీటి లభ్యత కంటే అధికంగా వినియోగించడంతో నీటి కష్టాలు వస్తున్నాయి. గ్రామాల్లో విచ్చలవిడి బోర్ల తవ్వకాలకు కొత్త విధానంతో కొంత వరకు కళ్లెం పడనుంది. వాల్టా చట్టం పటిష్టం కానుందని అధికారులు భావిస్తున్నారు.
పారదర్శకంగా నమోదు
జిల్లాలో పిజోమీటర్ల స్థ్ధానంలో ఆటోమెటిక్ పరికరాలను ఏర్పాటు చేస్తున్నాం. దాంతో జల మట్టం లెక్కలు పక్కాగా తేలనున్నాయి. నీటి పొదుపు, సంరక్షణపై ప్రజలు, రైతుల్లో అవగాహన పెంచుతున్నాం. కొత్త విధానంతో నీటి నమోదులో పారదర్శకత ఉంటుంది.
– డి.సునీల్బాబు, భూగర్భ వనరుల శాఖ జిల్లా ఉప సంచాలకుడు
బోరుబావుల అనుమతిలో పారదర్శకత
భూగర్భంలో నీటి నిల్వలు ఎంతో తెలియక విచ్చలవిడిగా బోర్లు వేస్తున్నారు. అడ్డగోలు వాడకంతో సాగు, తాగునీటి ఎద్దడి నెలకొంటున్నది. చేతి లెక్కల వల్ల వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు, క్వారీల అనుమతిలో పారదర్శకత లోపిస్తున్నది. ఆటోమెటిక్ డిజటల్ పరికరాలతో నీటి మట్టంలో శ్రాస్త్రీయత పెరుగనుంది. ఏ ప్రాంతంలో, ఎంత లోతులో ఎంత వినియోగం ఉందో స్పష్టంగా తేలనుంది. వర్షాలకు భూమిలో ఇంకే నీటి శాతాన్ని సులువుగా తెలుసుకోవచ్చు. నీటి సంరక్షణ చర్యలు తీసుకునేందుకు దోహదపడనుంది. వీటి ఆధారంగా వాటర్షెడ్ వంటి చైతన్య కార్యక్రమాలు చేపట్టనున్నారు.