సూర్యాపేట టౌన్, అక్టోబర్ 24 : చెడుపై మంచిని బతికించాలనే సంకల్పంతో నాడు పాండవులు జమ్మిచెట్టు వద్ద ఆయుధ పూజలు చేసి సాధించిన విజయానికి ప్రతీకగా విజయ దశమి వేడుకలను జరుపుకొంటున్నామని, అదే మాదిరిగా 14 ఏండ్లు ఉద్యమం చేసి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధే ఆయుధంగా అన్ని రంగాల్లో సమూల మార్పులు తీసుకొస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సోమవారం దసరా పండుగను పురస్కరించుకొని సూర్యాపేటలోని జమ్మిగడ్డలో జరిగిన వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. జమ్మి చెట్టుకు పూజలు చేసి ప్రజలకు విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మన సంస్కృతీ సంప్రదాయాలకు పూర్వ వైభవం తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనన్నారు. పదేండ్లలోనే వందేండ్ల అభివృద్ధి చేసి రాష్ర్టాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపారని తెలిపారు. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దసరా సంబురాలు అంబరాన్నంటాయి. జమ్మిచెట్టు పూజల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని బంధుమిత్రులతో కలిసి సరదాగా గడిపారు. పలుచోట్ల రావణ దహణాలు కోలాహలంగా సాగాయి. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వేడుకలకు హాజరై జనాన్ని ఉత్సాహ పరిచారు.
చెడుపై మంచి గెలుపే విజయదశమి అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సోమవారం విజయదశమిని పురస్కరించుకుని సూర్యాపేటలోని జమ్మిగడ్డలో నిర్వహించిన వేడుకల్లో అలాగే మంగళవారం వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించిన దసరా వేడుకలో మంత్రి కుటుంబ సమేతంగా పాల్గొని జమ్మి పూజలు నిర్వహించి ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చెడుపై మంచిని బతికించాలనే సంకల్పంతో పాండవులు జమ్మిచెట్టు వద్ద ఆయుధ పూజలు చేసి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. అదే మాదిరిగా 14 ఏండ్లు ఉద్యమం చేసి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నిరంతర అభివృధ్ధి పాలనే ఏకైక ఆయుధంగా భావించి ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అన్నారు. 60 ఏండ్లకు పైగా పాలించిన ఉమ్మడి పాలకుల హయాంలో అన్ని విధాలుగా ఆగమైన తెలంగాణ పాంతాన్ని అతి తక్కువ సమయంలో అద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్కే దక్కుతున్నదన్నారు. ఆసరా పింఛన్లు, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, నిరంతర విద్యుత్, తాగు, సాగునీరు ఇలా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఒక్క కేసీఆర్తోనే సాధ్యమని నేడు యావత్ దేశం నమ్ముతున్నదన్నారు.
ఉమ్మడి పాలకుల హయాంలో సూర్యాపేటలో జరిగిన పండుగ వేడుకలు, గత పదేండ్లుగా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న వేడుకలకు తేడాను ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారన్నారు. ప్రజలందరి ఆశీర్వాదంతో రాబోయే రోజుల్లోనూ ఇలాంటి ప్రశాంత వాతావరణంలో మరింత అభివృద్ధి సాధించుకుందామన్నారు.