మాడ్గులపల్లి, జూన్ 25 : ఉమ్మడి పాలనలో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం గ్రామాల్లో పరిపాలన సౌలభ్యం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. గతంలో గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు లేకపోడంతో అరకొర వసతుల నడుమ అద్దె భవనాల్లో పాలన సాగించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవతో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు మహర్దశ పట్టింది.
సీఎం కేసీఆర్ పాలనలో గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయి. మాడ్గులపల్లి మండలంలోని మాడ్గులపల్లి, ఆగామోత్కూర్, ఇసుకబావిగూడెం, చెరువుపల్లి, సీత్యాతండా, గారకుంటపాలెం, నారాయణపురం గ్రామాల్లో పరిపాలన సౌలభ్యం కోసం ఇటీవల ప్రభుత్వం ఒక్కో గ్రామ పంచాయతీకి వెయ్యి చదరపు గజాల స్థలంలో భవన నిర్మాణానికి రూ.20 లక్షల చొప్పున రూ.1.40 కోట్లు ఎన్ఆర్ఈజీఎస్ కింద నిధులు మంజూరు చేసింది. దీంతో భవన నిర్మాణాలకు పనులు ప్రారంభమయ్యాయి.
మండలంలో నారాయణపురం, గారకుంటపాలెం, ఇసుకబావిగూడెం, సీత్యాతండాలు కొత్త పంచాయతీలుగా ఏర్పడగా సీత్యాతండా, ఇసుకబావిగూడెం, గారకుంటపాలెం గ్రామ పంచాయతీలు అద్దె భవనాల్లో పాలన సాగిస్తున్నాయి. అలాగే మాడ్గులపల్లి, ఆగామోత్కూర్, చెర్వుపల్లిలో పంచాయతీ భవనాలు శిథిలావస్థకు చేరుకోగా నూతన గ్రామ పంచాయతీలను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, కంచర్ల భూపాల్రెడ్డి, నోముల భగత్ అందిస్తున్న సహకారంతో అధునాతన హంగులతో మండలంలోని ఆయా గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు చేపడుతుండడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదు
గత ప్రభుత్వాల హయాంలో గ్రామాలు అభివృద్ధికి నోచుకోక కుంటుపడ్డాయి. మాడ్గులపల్లి మండలంలో ఆయా గ్రామాల్లో గ్రామ పంచాయతీలకు అద్దె భవనాల్లో అసౌకర్యాల నడుమ పాలన కొనసాగించాం. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో గ్రామాలు సమగ్రంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఎమ్మెల్యేల చొరవతో మంజూరైన నిధులతో మండలంలోని ఆయా గ్రామాల్లో నూతన భవన నిర్మాణ పనులు చేపడుతున్నాం.
– పోకల శ్రీవిద్య, ఎంపీపీ, మాడ్గులపల్లి
పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త భవనాలు
గ్రామాల్లో పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆయా గ్రామ పంచాయతీల్లో నూతన భవనాల నిర్మాణాలను చేపట్టడం జరిగింది. మండలంలోని ఆయా గ్రామాల్లో ఒక్కో భవన నిర్మాణానికి వెయ్యి చదరపు గజాల్లో భవన నిర్మానానికి రూ.20 లక్షల నిధులు మంజూరై పనులు చకచకా జరుగుతున్నాయి. త్వరలోనే నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తాం.
– నరేశ్, పీఆర్ ఏఈ, మిర్యాలగూడ