ఆత్మకూరు ( ఎం ), మార్చి 14 : ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని రాంనగర్, ఇందిరానగర్ కాలనీలోని మరికొన్ని ఇండ్లు నిషేధిత జాబితాలో చేరనున్నాయి. 1908లోని సెక్షన్22ఎ పీవోటీ యాక్టు 1997 చట్టంలోని 9/2026లో అమలు చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన నిషేధిత జాబితా సోషల్ మీడియాలో చకర్లు కొడుతోంది. 1980లో అప్పటి ప్రభుత్వం దళితులు, బలహీనవర్గాల పేదల కోసం భూమిని కొనుగోలు చేసి ఇందిరానగర్ కాలనీ ఏర్పాటు చేసి ఇండ్లు నిర్మించి పంపిణీ చేశారు. 1985లో నాటి సర్కార్ ప్రభుత్వ భూమిని కొనుగోలు చేసి బడుగు, బలహీన వర్గాల పేదల కోసం రాంనగర్ పేరుతో కాలనీ ఏర్పాటు చేసి ఇండ్ల నిర్మాణం చేపట్టి పేదలకు పంపిణీ చేసింది. ఇందిరానగర్ కాలనీలో 70శాతం దళితులు 30 శాతం బీసీ వర్గాలకు చెందిన వారే ఉన్నారు.
రాంనగర్ కాలనీలో 90 శాతం బీసీలు, పది శాతం ఇతరులు నివాసం ఉంటున్నారు. 46 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఇందిరానగర్ కాలనీతో పాటు, 41 సంవత్సరం క్రితం ఏర్పడిన రాంనగర్ కాలనీ వాసులు, నాడు నిర్మించిన పెంకుటిళ్లను తొలగించుకొని పకా భవనాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇండ్ల నిర్మాణం కోసం బ్యాంకు రుణాలు కూడా పొందారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నేడు రాంనగర్, ఇందిరానగర్ కాలనీలో నివాసం ఉంటున్న 463 ఇండ్లను నిషేధిత జాబితాలో చేర్చడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇండ్లు లేని నిరుపేదల కోసం నిర్మించిన 48 డబుల్ బెడ్రూం ఇండ్లతో పాటు, పల్లెపహాడ్లోని బడుగు బలహీన వర్గాల కాలనీలోనీ 147 ఇండ్లను నిషేధిత జాబితాలో చేర్చినట్లు సమాచారం.
ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో, ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తోంది. మండల కేంద్రంలోని రాంనగర్, ఇందిరానగర్ కాలనీల్లోని ఇండ్లను నిషేధిత జాబితా నుంచి వెంటనే తొలగించాలి. ప్రభుత్వం పంపిణీ చేసిన భూములతో పాటు, ఇండ్లను, ఇంటి స్థలాలను 10 సంవత్సరాల తర్వాత లబ్ధిదారుల అవసరాల నిమిత్తం క్రయ, విక్రయాలు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. రేవంత్రెడ్డి కేవలం పేదలను ఇబ్బంది పెట్టేందుకే నిషేధిత జాబితాలను ప్రకటిస్తున్నారు. ఇలాంటి తప్పుడు నిర్ణయాలను ఉపసంహరించుకోవాలి.
-ప్రతికంఠం పూర్ణచందర్రాజు, మాజీ జెడ్పీటీసీ
పేదలను ఆదుకోవలసిన ప్రభుత్వం, పెద్దలకు కొమ్ము కాస్తూ బడుగు బలహీన వర్గాల ప్రజలను ఇబ్బందులు పెడుతోంది. 46 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఇందిరానగర్ కాలనీలో అధిక శాతం దళితులు నివాసం ఉంటున్నారు. ఆపద, సాపద కోసం, ఆరోగ్య సమస్యల కోసం, ఆడబిడ్డల పెండ్లిల్ల కోసం, కొందరు లబ్ధిదారులు తమ ఇంటి స్థలాలను, ఇండ్లను ఆర్థిక ఇబ్బందుల కారణంగా అమ్ముకున్నారు. ఇండ్ల నిర్మాణం కోసం బ్యాంకు రుణాలు కూడా పొందారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా, పేదల నిర్మించుకున్న ఇండ్లను నిషేధిత జాబితాలో చేరుస్తున్నట్లు ప్రకటించడం సిగ్గుచేటు.
-మేడి రామనరసయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు