మిర్యాలగూడ రూరల్, జూన్ 25 : ఆరోగ్య తెలంగాణలో భాగంగా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు గుడ్లు, పాలు, పప్పులు, కూరగాయలతో కూడిన పౌష్టికాహారాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా కార్యాచరణను రూపొందించి అమలు పరుస్తున్నది. అయితే అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు సరఫరా చేసే బాధ్యత కలిగిన కాంట్రాక్టర్లు నాసిరకం, చిన్నసైజు గుడ్లను పంపిణీ చేస్తున్నారని, అలాగే కొన్ని కేంద్రాల్లో నిత్యం కేంద్రాలకు రాని వ్యక్తులకు చెందిన కోడిగుడ్లను బయట విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం గుడ్లు స్టాంపింగ్ అనే వినూత్న ఆలోచనను ప్రవేశపెట్టింది. స్టాంపులు మూడు రంగుల్లో తయారు చేయబడుతాయి. నెమలి నీలం, ఎరుపు, ఆకుపచ్చ. అక్రమాలు జరుగకుండా ప్రతి పది రోజులకోసారి స్టాంపు రంగు సైతం మారుతుంది. గుడ్డుపై తెలుగు భాషలో గుండ్రని ఆకారంలో 16 మిల్లీమీటర్ల వ్యాసం, 3 మిల్లీమీటర్ల ఎత్తు లెటర్ స్టాంప్ను ముద్రిస్తున్నారు. స్టాంపులో ‘అంగన్వాడీ గుడ్డు’, ‘తెలంగాణ ప్రభుత్వం’ అనే పదాలు ఉన్నాయి.
మధ్యలో జోన్ను సూచిస్తుంది. అంగన్వాడీ కేంద్రానికి నెలలో ప్రభుత్వం మూడుసార్లు గుడ్లు సరఫరా చేస్తుంది. మొదటి దఫా సప్లయి చేసే గుడ్లపై నెమలి నీలం కలర్ స్టాంప్, రెండో దఫా సరఫరా చేసే గుడ్లపై రెడ్ కలర్ స్టాంప్, మూడో దఫాలో ఆకుపచ్చ కలర్ స్టాంపింగ్ వేసి సరఫరా చేస్తుంది. దీనితో గుడ్ల నాణ్యతలో అలాగే పక్కదారి పట్టేటటువంటి అక్రమాలకు అవకాశం ఉండదు. ప్రభుత్వ చర్యపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.