చండూరు, జనవరి 10 : మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడు కేటీఆర్ అని మరోమారు నిరూపించుకున్నారు. ఈ నెల 6న గట్టుప్పలకు వచ్చిన మంత్రి కేటీఆర్కు గ్రామ సర్పంచ్ ఇడెం రోజాతోపాటు ప్రజలు ఫార్మా కంపెనీ అనుమతులు రద్దు చేసి ఆదుకోవాలని విన్నవించారు. స్పందించిన మంత్రి కేటీఆర్ ప్రజల కోరిక మేరకు కంపెనీ ఏర్పాటును రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు పక్కనే ఉన్న నల్లగొండ జిల్లా కలెక్టర్ వినయ్క్రిష్ణారెడ్డికి ఆదేశాలు కూడా ఇచ్చారు. మంత్రి ఆదేశానుసారం కలెక్టర్ ఫార్మా కంపెనీ అనుమతులు రద్దు చేస్తూ వెంటనే పనులు కూడా నిలిపివేయాలని సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. సదరు ఆదేశాలను గట్టుప్పల తాసీల్దార్ పులి సైదులు ద్వారా కంపెనీ యాజమాన్యానికి పంపించారు. దాంతో గట్టుప్పల మండల కేంద్రంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీలకతీతంగా ఉద్యమం..
ఫార్మా కంపెనీ యాజమాన్యం తప్పుడు ధ్రువీకరణ పత్రాల ద్వారా కంపెనీ నిర్మాణ పనులు చేపట్టారని, వెంటనే పనులు నిలిపివేయాలని గట్టుప్పలకు చెందిన ఉద్యమకారుడు ఇడెం కైలాసంతోపాటు పలువురు గ్రామస్తులు, నాయకులు పార్టీలకతీతంగా ఉద్యమించారు. కంపెనీ ఎదుట బైటాయించి ధర్నాలు చేశారు. కలెక్టర్తోపాటు పలువురిని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. కంపెనీ ఏర్పాటయితే ఇక్కడి భూగర్భజలాలు కలుషితమైపోతాయని, తమ భవిష్యత్ అంధకారమవుతుందని ఆందోళన చెందారు. చేనేత కార్మికులు సైతం ఉపాధి కోల్పోతామని ఆవేదన వెలిబుచ్చారు. కానీ, ఎవరూ వారి గోడు వినలేదు. మంత్రి కేటీఆర్ ఎపుడైతే గట్టుప్పలను దత్తత తీసుకున్నారో నాటి నుంచి గ్రామ స్వరూపం మారుతూ వస్తున్నది. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతోపాటు ఫార్మా కంపెనీని రద్దు చేయడంపై ప్రజల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
మంత్రి కేటీర్కు రుణపడి ఉంటాం
ఇచ్చిన మాట ప్రకారం ఫార్మా కంపెనీ అనుమతులు రద్దు చేయించిన మంత్రి కేటీఆర్కు తాము సర్వదా రుణపడి ఉంటాం. ఫార్మా కంపెనీని అడ్డుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఎవరూ పట్టించుకోలేదు. కానీ, మంత్రి కేటీఆర్కు విన్నవించిన వెంటనే రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం చూస్తే ఆయనకు ప్రజా సంక్షేమంపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతున్నది. భవిష్యత్లో గట్టుప్పల్ మరింత అభివృద్ధి చెందనున్నది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజలు కూడా అంతే స్థాయిలో ప్రభుత్వ రుణం తీర్చుకుంటారు.
-ఇడెం కైలాసం, ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్ మండల కన్వీనర్, గట్టుప్పల