బొడ్రాయిబజార్, ఏప్రిల్ 21 : వృక్షో రక్షతే రక్షితః.. చెట్లను మనం రక్షిస్తే అవి మనలను రక్షిస్తాయని పెద్దలు చెప్పిన మాటలు నేడు నిజమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆరు విడుతల్లో విరివిగా నాటిన మొక్కలు నేడు వృక్షాలై నీడనిస్తున్నాయి. మండే వేసవిలో జనం వాటి కింద సేద తీరుతున్నారు. అసలే వేసవి కాలం.. ఎండలు మండిపోతున్నాయ్. పశుపక్షాదులతోపాటు మనుషులు సైతం బయటకు వెళ్లాలంటే అల్లాడిపోతున్నారు. ఇలాంటి సమయంలో హరితహారంలో నాటిన మొక్కలు ప్రజలకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తున్నాయి. సూర్యాపేట పట్టణంలో హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి స్వచ్ఛమైన గాలిని అందించడంతోపాటు చల్లని నీడనిస్తున్నాయి.
ప్రధాన వీధుల్లో ఏపుగా పెరిగిన చెట్ల నీడన వీధి వ్యాపారులతోపాటు పలు దుకాణాల వారు వ్యాపారాలను చల్లగా చేసుకుంటున్నారు. ఎండలో వెళ్లే వాహనదారులు, పాదచారులు చెట్ల కింద కాసేపు ఆగి సేద తీరుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరి ఇండ్ల ముందు మొక్కలను వారే సంరక్షించుకోవాలని అవగాహన కల్పించారు. దీంతో ప్రజలు తమ ఇంటి ముందు మొక్కలకు నీళ్లు పోస్తూ పెంచారు. అలాగే మున్సిపాల్టీ ఆధ్వర్యంలో ప్రధాన వీధుల్లో మొక్కలకు రోజూ నీళ్లు పోశారు. దీంతోపాటు వారానికో రోజు వాటరింగ్ డే కార్యక్రమాలు చేపట్టి మొక్కలకు నీళ్లు పోసి సంరక్షణ చర్యలు చేపట్టారు. ఫలితంగా హరితహారం మొక్కలు మహా వృక్షాలై ప్రజలకు పలు రకాలుగా ఉపయోగపడుతున్నాయి.
రెండేండ్లుగా చెట్టు నీడనే వ్యాపారం
నేను రెండు సంవత్సరాలుగా ఇక్కడ గాలి మిషన్ నడుపుతున్నా. నా వ్యాపారాన్ని హరితహారంలో నాటిన మొక్క చల్లగా చూస్తున్నది. మండు వేసవిలో సైతం ఇక్కడ ఏసీలో కూర్చున్నట్లుగానే ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో చాలా మంది వచ్చి ఇక్కడ సేద తీరుతుంటారు. ఈ మొక్క ఇక్కడ ఉండడం అదృష్టంగా భావిస్తున్నా. హరితహారంలో మొక్కలు నాటడం వల్ల ఉపయోగం ఏమిటో ప్రజలకు ఈ వేసవిలో అర్థమవుతున్నది.
– జానీ, గాలి మిషన్ నిర్వాహకుడు, సూర్యాపేట
హరితహారం మొక్కలను సంరక్షించాలి
రాష్ట్రంలో అడవుల శాతం పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారాన్ని జిల్లాలో మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలో సూర్యాపేట మున్సిపాల్టీలోని అన్ని వీధుల్లో విరివిగా మొక్కలు నాటి సంరక్షిస్తున్నాం. ఇప్పుడవి పెరిగి పట్టణ ప్రజలకు నీడనివ్వడం ఆనందంగా ఉంది. హరితహారం మొక్కల సంరక్షణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి.
– పెరుమాళ్ల అన్నపూర్ణ, మున్సిపల్ చైర్పర్సన్, సూర్యాపేట
మధ్యాహ్నం మొత్తం చెట్ల నీడలోనే..
నేను మార్బుల్ పని చేస్తుంటా. ఉదయాన్నే పని కోసం అడ్డా మీదకు వస్తాను. ఇల్లు చాలా దూరం కావడంతో మధ్యాహ్నం కాసేపు లభించే విశ్రాంతి సమయాన్ని హరితహారం చెట్ల నీడలోనే గడుపుతా. మధ్యాహ్నం ఎండలో తిరిగి అలిసిపోయిన వారికి హరితహారం మొక్కలు నీడనిచ్చి కాపాడుతున్నాయి.
– సాయికృష్ణ, మార్బుల్ వర్కర్, రాజీవ్నగర్, సూర్యాపేట
హరితహారం మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అన్ని వార్డుల్లో హరితహారం మొక్కల సంరక్షణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాం. మొక్కల సంరక్షణపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ వాటి ఆవశ్యకతను తెలియజేస్తున్నాం. మున్సిపల్ వాటర్ ట్యాంకర్ల ద్వారా రోజూ నీళ్లు పెడుతున్నాం. దాంతో నేడు అన్ని వార్డుల్లో మొక్కలు పెరిగి పెద్దవై ప్రజలకు ఉపయోగపడుతున్నాయి.
– పి.రామానుజులరెడ్డి, మున్సిపల్ కమిషనర్, సూర్యాపేట