హోటల్ మేనేమెంట్లో మంచి ఉద్యోగం. 15 ఏండ్లు ఐదు స్టార్ హోటళ్లలో పనిచేశాడు. ఖతార్ దేశంలోని మాల్ ఆఫ్ ఖతార్లో ఫుడ్ కోర్ట్ సూపర్వైజర్గా నాలుగేండ్లు ఉద్యోగం చేశాడు. లక్ష రూపాయల వరకు జీతం వస్తున్నా అవేమీ అతనికి తృప్తినివ్వలేదు. ఒకరి కింద జీతం ఎప్పటికైనా బానిసత్వమే అని తానే నలుగురికి ఉపాధి చూపించాలని నిశ్చయించుకున్నాడు. ఊర్లో తనకు ఉన్న నాలుగు ఎకరాల భూమిలో పౌల్ట్రీ ఫాం ఏర్పాటు చేసి వ్యవసాయం చేయాలని గ్రామానికి వచ్చాడు. పౌల్ట్రీ ఫామ్ పెట్టి ఐదేండ్లుగా మంచి లాభాలు ఆర్జిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు యువ రైతు కందాల నర్సింహ.
– సంస్థాన్ నారాయణపురం, జనవరి 9
సంస్థాన్ నారాయణపురం మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన కందాల ఎల్లయ్య, రాములమ్మ దంపతులది వ్యవసాయ కుటుంబం. ఆయన కుమారుడు కందాల నర్సింహ 2007 సంవత్సరంలో బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేశాడు. హైదరాబాద్లోని ప్రముఖ హోటల్లో 11 సంవత్సరాలు హోటల్ మేనేజ్మెంట్గా ఉద్యోగం చేశాడు. తర్వాత ఖతార్ వెళ్లి మాల్ ఆఫ్ ఖతార్లో ఫుడ్ కోర్ట్ సూపర్వైజర్గా నాలుగేండ్లు పనిచేశాడు. అవి తనకు నచ్చక సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని స్వదేశానికి తిరిగి వచ్చాడు.
ఊర్లో తనకు ఉన్న నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిలో పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. వ్యవసాయ సహకార సంఘంలో రూ.10 లక్షలు లోన్ తీసుకుని రూ.20 లక్షల పెట్టుబడితో 2018లో 10 వేల కోళ్ల సామర్థ్యం కలిగిన పౌల్ట్రీ షెడ్ను ఏర్పాటు చేశాడు. దాంతోపాటు బయటి వ్యక్తులకు చెందిన 6 వేల కోళ్ల సామర్థ్యం కలిగిన షెడ్ను లీజుకు తీసుకున్నాడు. తనకు ఉన్న భూమితోపాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. అందులో వరితోపాటు పత్తి పండిస్తున్నాడు. రెండు కోళ్ల షెడ్లపై 45 రోజులకు రూ.1.30 లక్షలు సంపాదిస్తున్నాడు. కోళ్ల ఎరువును విక్రయిస్తే వచ్చిన డబ్బుతో ఫామ్ ఖర్చులకు సరిపోతున్నాయి.
తన భార్య కూడా సహకారం అందిస్తుండడంతో ఇబ్బంది లేకుండా ఫామ్ నడుపుతున్నాడు. ఇంటి దగ్గర ఉంటూ తల్లిదండ్రులను, భార్య పిల్లలను చూసుకుంటూ నలుగురికి ఉపాధి కల్పిస్తూ సంతోషంగా ఉన్నానని నర్సింహ తెలిపాడు. రాష్ట్ర ప్రభుత్వ పౌల్ట్రీ ఫాం రంగానికి సహాయ సహకారాలు అందిస్తున్నదని, సొంత భూమి, నీళ్లు ఉంటే పౌల్ట్రీ ఫామ్లో మంచి లాభాలు పొందవచ్చని సూచిస్తున్నాడు.