నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి10 (నమస్తే తెలంగాణ) : ప్రస్తుత ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిళ్లు, ఉరుకుల పరుగుల జీవనశైలిలో బీపీ, షుగర్ వ్యాధులు సర్వ సాధరణమయ్యాయి. వీటిని సకాలంలో గుర్తించక తీవ్ర అనారోగ్యానికి గురవుతున్న వారు సైతం ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వీటిపై సరైన అవగాహన లేక హైబీపీ లేదా కొన్నిసార్లు లోబీపీతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇక షుగర్ వ్యాధి విషయంలోనూ అంతే. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే బీపీ, షుగర్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ అవసరమైన మందులు అందించాలని నిర్ణయించింది. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయోగం జరుగనుంది. అయితే ఈ పథకంపై ప్రభుత్వం గతేడాది నుంచే కార్యచరణ సిద్ధం చేసింది.
గతేడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ప్రజలకు బీపీ, షుగర్ పరీక్షలకు సంబంధించిన స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించింది. గ్రామాల్లోని ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలతో ఇంటింటికి తిరిగి వీటి బారిన పడిన వారిని గుర్తించింది. ఈ పరీక్షల అనంతరం నల్లగొండ జిల్లా వైద్యాధికారుల లెక్కల ప్రకారం మొత్తం 2.91లక్షల మంది బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. జిల్లాలో మొత్తం 2,23,490మంది బీపీ రోగులు ఉండగా 68,175మంది షుగర్ వ్యాధి బారిన పడిన వారు ఉన్నారు. వీరిలోనూ బీపీ, షుగర్ రెండూ ఉన్న వారు 50వేల వరకు ఉండవచ్చని అంచనా. షుగర్ ఉండి బీపీ నార్మల్గా ఉన్న వారు సైతం 20వేల మంది ఉన్నారు. ప్రస్తుతం వీరందరికీ బీపీ, షుగర్ మందులను ఉచితంగా అందించేందుకు రంగం సిద్ధం చేశారు. పంపిణీ కోసం ఇప్పటికే జిల్లాకు 1.48లక్షల ఎన్సీడీ కిట్స్ వచ్చాయి. వీటన్నింటినీ జిల్లా కేంద్రం నుంచి పీహెచ్సీలకు తరలించారు.
నేటి నుంచి ప్రారంభం
బీపీ, షుగర్ వ్యాధులకు ఉచిత మందుల పంపిణీకి నల్లగొండ జిల్లాలో నేటి నుంచి శ్రీకారం చుట్టనున్నారు. శనివారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి, జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం క్షేత్రస్థాయిలోనూ పంపిణీ మొదలుపెడతారు. ఇప్పటికే గుర్తించిన బీపీ, షుగర్ బాధితుల వివరాలను ఆన్లైన్లో పొందుపరిచారు. వీరందరికీ ఇంటింటికి తిరిగి పంపిణీ చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. గ్రామాల్లోని ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు ఇప్పటికే సిద్ధం చేసిన జాబితా ప్రకారం మందులు అందించనున్నారు.
నెల రోజులకు సరిపడా మందులతో పాటు వీటిని ఎలా ఉపయోగించాలన్న సూచనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన ప్రత్యేక పౌచ్లతో కలిపి మెడికల్ కిట్లను సిద్ధం చేశారు. ఈ మెడికల్ కిట్స్ను నేరుగా బాధితులకు అందించనున్నారు. ఇక ఇదే సమయంలో అవసరమైన వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లోనూ నమోదు చేస్తారు. దీంతో బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎంతో ప్రయోజనం కలుగునుంది. ప్రతినెలా వందలాది రూపాయల ఖర్చు తప్పడంతో పాటు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు, మందులు అందుబాటులోకి రానున్నాయి. తద్వారా వీరూ ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలతో ధీర్ఘకాలికంగా తమ ఆరోగ్యాలను కాపాడుకునేందుకు ఎంతో ఉపయుక్తం కానుండడంతో ఉచిత మందుల పంపిణీపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
ప్రతినెలా పంపిణీకి ఏర్పాట్లు
జిల్లాలో దీర్ఘకాలిక రోగాలైన బీపీ, షుగర్తో బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా మందులు పంపిణీ చేస్తాం. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. గతంలో స్క్రీనింగ్ పరీక్షలతో బీపీ, షుగర్ బాధితులను గుర్తించాం. వీరిందరి వివరాలు ఆన్లైన్లో పొందుపరిచాం. జిల్లాలో మొత్తం 2.91లక్షల మందికి ఉంచితంగా మందులు అందిస్తాం. ప్రతినెలా మందులను ఇంటికే పంపిణీ చేయడం జరుగుతుంది. ఆదేవిధంగా ఇంటి వద్దే పరీక్షలు చేసి వారి ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు అన్లైన్ నమోదు చేస్తాం.
– ఎ.కొండల్రావు, డీఎంహెచ్ఓ నల్లగొండ