సూర్యాపేట రూరల్, అక్టోబర్ 7 : 2014కు ముందు అచేతనంగా మారిన కుల సంఘాలు, వ్యాపార వృత్తులకు జీవం పోసింది సీఎం కేసీఆరే అని, ఆయన పాలనలో తెలంగాణలో స్వర్ణయుగం వచ్చిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని కేసారం గ్రామ సమీపంలో బట్రాజు, మేదరి, రజక సంఘాల కమ్యూనిటీ హాళ్లు, మొబైల్ షాప్స్ అసోసియేషన్ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. అన్ని కులాలు, మతాలకు సమన్యాయం కల్పిస్తున్న సీఎం కేసీఆర్, ఆయా కుల వృత్తుల వారి ఆత్మగౌరవం పెంచేందుకు సంక్షేమ భవనాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. కుల వృత్తిదారుల ఆర్థిక బలోపేతమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, అందులో భాగంగానే వృత్తిదారులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రం ఏర్పడక ముందు కరువు కాటకాలు, దారిద్య్రాలతో అలమటించిన సూర్యాపేట సీఎం కేసీఆర్ పాలనలో దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా అవతరించిదన్నారు. తొమ్మిదన్నర ఏండ్లలో సూర్యాపేటను వేధిస్తున్న అనేక సమస్యలను పరిష్కరించుకున్నట్లు గుర్తుచేశారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు బాగుంటేనే అది మంచి సమాజం అవుతుందని నమ్మే సీఎం కేసీఆర్ కుల వృత్తి సంఘాల సంక్షేమ భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. సబ్బండ వర్గాలకు రాజకీయంగా పదవులిచ్చి సముచిత గౌరవం ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరినట్లు తెలిపారు. అందరి బాగు కోరే సీఎం కేసీఆర్ను మరోసారి ఆశీర్వదించి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.