చౌటుప్పల్, ఏప్రిల్ 29 : అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ అన్నారు. చౌటుప్పల్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.
కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గతంలో బీఆర్ఎస్ సర్కారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల మోసాన్ని కూడా గుర్తు చేయాలని తెలిపారు. ఇందుకోసం ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.