రామన్నపేట, ఏప్రిల్ 28 : భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్ గెలుపు కోసం పార్టీ కార్యకర్తలు కష్టపడి పని చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో యాదాద్రి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిరుమర్తి మాట్లాడుతూ అధికారం, పదవులతో సంబంధం లేకుండా కష్టపడే ప్రతి కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. ఈ విషయాన్ని బూత్ స్థాయిలో ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారని, పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు.