కోదాడ, జనవరి 18 : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను సమీక్షించుకొని.. లోక్సభ ఎన్నికలకు పక్కా ప్రణాళికతో సన్నద్ధం అవుదామని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కోదాడ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలు అధైర్య పడొద్దు.. తాను వెన్నంటి ఉంటానని భరోసా ఇచ్చారు.
నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. ఎన్నికల తర్వాత జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది మనమేనని పేర్కొన్నారు. మల్లన్న యువసేన ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశామని, ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతుందని చెప్పారు.
మన పార్టీకి బలమైన నాయకులు, అద్భుతమైన నాయకత్వం ఉన్నదని, ఎవరూ నిరూత్సాహ పడాల్సిన అవసరం లేదని అన్నారు. పార్టీకి అన్ని వర్గాలు దగ్గరయ్యేలా కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. పదవిలో ఉన్నా, లేకపోయినా నియోజకవర్గ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఎళ్లవేళ్లలా అందుబాటులో ఉంటానని, వారి కష్టసుఖాల్లో భాగస్వామ్యం అవుతానని అన్నారు. సమావేశంలో పార్టీ సీనియర్ నాయకుడు పైడిమర్రి సత్యంబాబు, ఆయా మండలాల అధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.