నల్లగొండ, ఫిబ్రవరి 9 : కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకున్న చీకటి ఒప్పందంలో భాగంగా కేఆర్ఎంబీ పరిధిలోకి కృష్టా ప్రాజెక్టులు వెళ్లాయని, కృష్ణా జలాలను పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. మన హక్కులు మనం పొందడానికి ఈ నెల 13న నల్లగొండలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. నల్లగొండలోని శుక్రవారం పట్టణ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన సభ నల్లగొండ అసెంబ్లీ ఇన్చార్జి రవీందర్ సింగ్తో కలిసి మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల కృష్ణా ప్రాజెక్టులు కేంద్రం పరిధిలోకి వెళ్లాయని, వాటి సాధన కోసం మరోసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నడుం బిగించారని తెలిపారు. ఆయనకు మద్దతుగా బహిరంగ సభకు రైతులు, ప్రజలు తరలివచ్చి గొంతెత్తాల్సిన అవసరం ఉందని చెప్పారు. వచ్చే పార్లమెంట్, మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నల్లగొండ నియోజక వర్గ పార్టీ ఇన్చార్జి, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ నాడు నల్లగొండ నీళ్ల కోసం ఎన్నో కష్టాలు పడ్డదని, ఒక్క బోరు పడటానికి ఎన్నో బోర్లు వేసి రైతులు అప్పుల పాలు అయిన సంఘటనలు అందరికీ తెలుసన్నారు.
అలాంటి నల్లగొండ పదేండ్లు పచ్చగా ఉంటే ఇప్పుడు సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు కేంద్రం పరిధిలోకి వెళ్లడంతో మళ్లీ నీటి కష్టాలు తప్పవని పేర్కొన్నారు. అమలు చేయలేని 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు కూడా తీర్చే పరిస్థితుల్లో లేదని తెలిపారు. సభకు ప్రతి వార్డు నుంచి రెండు వందల మంది చొప్పున నియోజక వర్గ వ్యాప్తంగా 30వేల మంది తరలిరావాలని కోరారు.
ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, మాజీ గ్రంథాలయ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, నాయకులు కటికం సత్తయ్యగౌడ్, అభిమన్యు శ్రీనివాస్, మారగోని గణేశ్, పూజిత శ్రీనివాస్, బొర్ర సుధాకర్, మాలె శరణ్యారెడ్డి, సింగం లక్ష్మి, యాట జయప్రదరెడ్డి, యామ దయాకర్, నాగరత్నం రాజు, బక్క పిచ్చయ్య, సందినేని జనార్దన్ రావు పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడ బైపాస్ సమీపంలో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను శుక్రవారం మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, జాజుల సురేందర్, చంటి క్రాంతి కిరణ్, శానంపూడి సైదిరెడ్డితోపాటు మాజీ మేయర్ రవీందర్ సింగ్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 13న సభకు మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నందున రైతాంగం
పిలుపునిచ్చారు. వారి వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, నాయకులు రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, రావుల శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజక వర్గం నుంచి వెయ్యి నుంచి రెండు వేలు, ఉమ్మడి నల్లగొండ జిల్లా నియోజక వర్గాల నుంచి పది వేలు, నల్లగొండ నియోజక వర్గం నుంచి 30వేల వరకు రైతాంగాన్ని సమీకరించే విధంగా బీఆర్ఎస్ పార్టీ చర్యలు తీసుకుంటున్నది.