చందంపేట, నవంబర్ 28 : గత పది రోజుల నుంచి కురిసిన వర్షాలతో మండలంలోని కుంటలు, చెరువులు పూర్తిస్థాయిలో జలకళను సంతరించుకున్నాయి. భారీ వర్షాలకు డిండి ప్రాజెక్టు నిండటంతో రిజర్వాయర్ కాల్వల ద్వారా వరద నీరు వచ్చి చేరడంతో కుంటలు పూర్తిగా నిండాయి. ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ మండలంలోని నీటి వనరులను ప్రాజెక్టు నీటితో నింపాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు కాల్వలు ఏర్పాటు చేసి కుంటలకు మళ్ళించారు. దీంతో మండలంలోని పోలేపల్లిలో గల సచ్చోని కుంట, ఊర కుంట, గన్నెర్లపల్లిలోని ఊర కుంట, ముడుదండ్లలో తీగల చెరువు, లక్ష్మీదేవి చెరువులను నింపేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీనిపై జడ్పీటీసీ పవిత్ర, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మల్లారెడ్డి, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు రాజవర్దన్ రెడ్డి, నాయకులు అనంతగిరి, మున్నయ్య యాదవ్, నారాయణ రెడ్డి, మోహన్ కృష్ణ హర్షం వ్యక్తం చేస్తున్నారు.