వలిగొండ, ఏప్రిల్ 30 : ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని అధికారులు, మిల్లర్లు కలిసి కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిలిచిపోవడంతో కడుపు మండిన వలిగొండ మండలంలోని సంగెం, వర్కట్పల్లి గ్రామాలకు చెందిన సుమారు 100 మందికి పైగా రైతులు ట్రాక్టర్లలో ధాన్యం తీసుకొచ్చి కలెక్టర్ కార్యాలయం ఎదుట కింద పోసి ఆందోళన చేపట్టారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా కదంతొక్కి వెంటనే ధాన్యం కొనుగోళ్లను వెంటనే చేపట్టి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. అధికారులు, మిల్లర్లు కుమ్మక్కై వారం రోజులుగా ధాన్యం కొనుగోళ్లను నిలిపివేశారని, కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను మిల్లులకు తరలించాలంటే రైతుల నుంచి లారీ యజమానులు బస్తాకు రూ.5 అదనంగా డిమాండ్ చేస్తున్నారని వాపోయారు.
మిల్లర్లు తాలు, తరుగు పేరుతో 5 కిలోలు కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ-గ్రేడ్ ధాన్యాన్ని మిల్లుల వద్దకు రాగానే బీ-గ్రేడ్ ధాన్యంగా మారుస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్, అధికారులు బయటకు వచ్చి సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. ఇదే సమయంలో పోలీసులు రంగప్రవేశం చేయడంతో కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా రైతులు వెనక్కి తగ్గలేదు. దీంతో రెండు వైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అనంతరం పలువురు రైతులు కలెక్టరేట్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్షాలోమ్కు వినతిపత్రం అందజేశారు.
అధికారులు, మిల్లర్లు కలిసి ముంచుతుండ్రు
ధాన్యం కొనుగోలు చేయకుండా అధికారులు, మిల్లర్లు కలిసి రైతులను నిండా ముంచుతుండ్రు. మార్కెట్లో వారం రోజులుగా ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. లారీ యజమానులు బస్తాకు 5 రూపాయలు డిమాండ్ చేస్తుండ్రు. మిల్లర్ల చేతిలో అధికారులు కీలుబొమ్మలుగా మారిండ్రు. ప్రభుత్వానికి, అధికారులకు రైతుల గోస పట్టడం లేదు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి. లేకుంటే రైతుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది.
-సోలిపురం జనార్దన్రెడ్డి, రైతు, వర్కట్పల్లి, వలిగొండ మండలం
వడ్లు కొనక వారమైంది..
లారీలు రాక వారం రోజులుగా మార్కెట్లో ధాన్యం కొనుగోళ్లు జరుగలేదు. లారీ యజమానులు బస్తాకు 5 రూపాయలు అడుగుతుండ్రు. అధికారులు మొక్కుబడిగా వచ్చిపోతుండ్రు గానీ ధాన్యం మాత్రం కొంటలేరు. మిల్లర్ల చేతిలో అధికారులు కీలుబొమ్మగా మారారు. ధాన్యం లోడ్లతో వెళ్లిన లారీలను మిల్లుల వద్ద ఏరోజుకు ఆరోజు ఖాళీ చేయించేలా చర్యలు చేపట్టాలె. అధికారులను అడిగితే మిల్లర్ల మీద, మిల్లర్లను అడిగితే అధికారుల మీద నెపం వేస్తూ కాలయాపన చేస్తుండ్రు.
-జక్కల వెంకటేశ్, రైతు, సంగెం, వలిగొండ మండలం