సూర్యాపేట, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి ఓ ఏజెన్సీ అమాయకులను బురిడీ కొట్టించి లక్షల్లో దండుకున్నది. ఏకంగా జిల్లాస్థాయి అధికారులు ఉండే కలెక్టరేట్లో ఓ ముగ్గురికి నకిలీ పోస్టింగ్లు ఇచ్చి వేతనాలు కూడా అందిస్తున్నది. వారిని ఎరగా చూసి మరో పాతిక మందికి దగ్గరి నుంచి పెద్దమొత్తంలో సొమ్ము కాజేసింది. డబ్బు తీసుకున్న వ్యక్తి ఎంతకీ ఉద్యోగాలు చూపించకపోడంతో బాధితులు నిలదీయగా.. విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటిదాకా కలెక్టరేట్లో ఫేక్ జాయినింగ్ ఆర్డర్తో మూడు నెలలుగా పని చేస్తున్న వారిని గుర్తించిన వారే లేకపోవడం విడ్డూరం. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట కలెక్టరేట్లో పారిశుధ్య పనుల కోసం ఔట్ సోర్సింగ్ పద్ధతిన ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మణికంఠ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకులు ఆరు నెలల కిందట నెలల కిందట ముగ్గురిని విధుల్లోకి తీసుకున్నారు. ఆ ముగ్గురికి నెల నెలా 5వేల రూపాయల నుంచి 7 వేల రూపాయలు వేతనం ఇస్తూ ఐదు నెలల తరువాత 22 వేలు వస్తాయని నమ్మించారు. ఆ ముగ్గురికి అటెండెన్స్ తీసుకునేందుకు మరో యువతిని నియమించి ఆమెకు నెలనెలా 18 వేల చొప్పున వేతనం ఇస్తూ విషయం బయటకు తెలియకుండా మేనేజ్ చేశారు. ఇలా మొత్తం నలుగురికి వేతనాలు ఇస్తూ వారి ద్వారా తెలిసిన వారిని శానిటేషన్ ఉద్యోగాల్లో చేర్చుకుంటామని చెప్పి ఒక్కొక్కరి నుంచి లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల వరకు దాదాపు 25 మంది నుంచి వసూలు చేసినట్లు బాధితులు చెప్తున్నారు.
కొద్దిమందికి పారిశుధ్య పనులు చేసేందుకు ఉత్తర్వులు కూడా ఇవ్వడం గమనార్హం. ఇంకొందరికి వారంలో.. పది రోజుల్లో ఇస్తామంటూ రోజూ తిప్పించుకుంటున్నారు. ఇలా నెలలు గడుస్తుండడంతో తమకు ఉద్యోగాలైనా ఇవ్వండి లేదంటే తమ డబ్బులైనా ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మెయిన్ రోడ్డులో గల ఓ ప్రైవేట్ కార్యాలయంలో ఉద్యోగాలిస్తామని నమ్మబలికి డబ్బులు తీసుకున్న ఏజెన్సీ నిర్వాహకుడితో వాగ్వాదానికి దిగడం… విషయం మీడియా, పోలీసులకు తెలియడంతో శంకర్ అనే వ్యక్తితోపాటు బాధితులను పోలీసులు స్టేషన్కు తరలించి విచారణ చేస్తున్నారు. బాధితుల వద్ద ఉన్న ఒక ఉద్యోగ నియామక పత్రం సరైనదా, కాదా అని జిల్లా ఉపాధి కల్పన అధికారి అక్బర్ హబీబ్ను వివరణ కోరగా అది ఫేక్ అని తేల్చారు. ఇప్పటికే కలెక్టరేట్లో తాగునీరు లేక, బాత్రూముల్లో నీళ్లు అందుబాటులో లేక అనేక సార్లు ఉన్నతాధికారులకు లేఖలు సమర్పించినా ఫలితం లేకపోవడం, ఇప్పుడు కలెక్టరేట్లోనే ముగ్గురు ఔట్సోర్సింగ్ పేరిట విధులు నిర్వహించినా కనీసం గుర్తించలేని పరిస్థితి నెలకొనడం పట్ల సమీకృత కలెక్టరేట్ నిర్వహణ ఎంత అధ్వానంగా తయారైందో తేటతెల్లం చేస్తున్నది.