మునుగోడు, ఏప్రిల్ 08 : ప్రస్తుతం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామం వరకే ఉన్న బ్రాహ్మణ వెల్లంల లెఫ్ట్ మెయిన్ కెనాల్ను మునుగోడు మండలం కిష్టాపురం వరకు 11.5 కిలోమీటర్ల పొడిగించనున్నట్లు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తెలిపారు. మంగళవారం బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ ఇంజినీర్లతో ఎమ్మెల్యే హైదరాబాద్లోని తన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కెనాల్ విస్తరణతో మునుగోడు మండలంలో 25 వేల ఎకరాల ఆయకట్టును పెంచే దిశగా ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు.
బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ నుండి మునుగోడు మండలంలోని భూములను సస్యశ్యామలం చేసే దిశగా అడుగులు ముందుకు పడుతున్నట్లు తెలిపారు. మునుగోడు మండలంలో వీలైనంత ఆయకట్టుకు నీటిని అందించే విధంగా అంచనాలు రెడీ చేసి పనులు మొదలుపెట్టాలని ఇంజినీర్లకు సూచించారు. భవిష్యత్లో అవసరం అయితే కిష్టాపురం చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా మార్చుకుని అక్కడినుండి ఎగువ ప్రాంతానికి లిఫ్ట్ల ద్వారా నీరందించాలన్నారు. కిష్టాపురం వరకు వచ్చే మెయిన్ కెనాల్తో పాటు కిష్టాపురం తర్వాత ఎంతవరకు వెసులుబాటు ఉంటే అంతవరకు డిస్ట్రిబ్యూషన్ కాల్వలు తవ్వడానికి కావాల్సిన సర్వే, భూసేకరణ పనులు వెంటనే మొదలు పెట్టాలన్నారు.
బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్ట్లో సరిపడా నీరు ఉండేలా పానగల్లు ఉదయ సముద్రం నుండి నీటిని తీసుకుని వచ్చే వానకాలం పంటలకు రెడీగా ఉండాలన్నారు. భవిష్యత్లో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పూర్తయిన తర్వాత కృష్ణా నీటిని సమృద్ధిగా వాడుకోవడానికి పానగల్లు ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ కెపాసిటీ పెంచుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కావునా బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ నుండి మునుగోడు మండలంలో ఆయకట్టును సాధ్యమైనంతవరకు పెంచే విధంగా పనులు వెంటనే మొదలు పెట్టాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఈఈ శ్రీనివాస్రెడ్డి, డీఈ విఠలేశ్వర్, ఏఈఈ నవీన్కుమార్ పాల్గొన్నారు.