ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తి, జాతీయ భావం పెంపొందించేందుకు నల్లగొండ పట్టణంలో నిర్వహిస్తున్న జాతీయ గీతాలాపన విజయవంతంగా రెండేండ్లు పూర్తి చేసుకున్నది. నల్లగొండకు చెందిన జనగణమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జనవరి 23, 2021న ప్రారంభమైన కార్యక్రమం ప్రతిరోజూ చౌరస్తాలు, వ్యాపార కేంద్రాల్లో కొనసాగుతూ ప్రజల నుంచి అపూర్వ స్పందన దక్కించుకున్నది. సోమవారం జిల్లా కేంద్రంలో ద్వితీయ వార్షికోత్సవాన్ని నిర్వహించగా సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వాసగిరి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ జెండాకు సెల్యూట్ చేసి గీతాలాపన చేశారు. నేటి విద్యార్థులు, యువతలో క్రమశిక్షణ లోపించిందని, తల్లిదండ్రులు, గురువులు వారిలో సత్ప్రవర్తన తెచ్చేందుకు కృషి చేయాలని లక్ష్మీనారాయణ కోరారు.
రామగిరి, జనవరి 23: ప్రతి వ్యక్తి ఆలోచనలో సమాజశ్రేయస్సు కోసం మార్పు రావాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా విద్యార్థులు, యువత స్వాతంత్రయోధుల స్ఫూర్తిని పుణికి పుచ్చుకోవాలని సీబీఐ మాజీ డైరెక్టర్ వాసగిరి లక్ష్మీనారాయణ సూచించారు. జనగణమన ఉత్సవ సమితి -నల్లగొండ ఆధ్వర్యంలో నిత్య జాతీయ గీతాలాపన ద్వితీయ వార్షికోత్సవం, నేతాజీ సుభాశ్ చంద్రబోస్ జయంతి వేడుకలను నల్లగొండలోని చినవెంకట్రెడ్డి ఫంక్షన్ హాల్లో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. నేటి విద్యార్థులు, యువతరంలో క్రమశిక్షణ లోపించిందని దాని ఆచరణలో పెట్టి ఉత్తములుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. యువత డ్రగ్స్, చె డు అలవాట్లకు దూరంగా ఉండాలని మంచి వారితో స్నేహం చేయాలని సూచించారు. విద్యా అంటే డిగ్రీ కాదని చదువు సంస్కారం నేర్పాలని, క్రమశిక్షణ కలిగించాలన్నారు.
నేటి తరంలో జాతీయుత పెంచేలా జనగణమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నల్లగొండలో 12 కూడలిల్లో నిత్య జాతీయ గీతాలపన చేయడం అభినందనీయమన్నారు.
ఇదే స్ఫూర్తి తెలంగాణ అంతా విస్తరించి భవిష్యత్తులో దేశంలో ఆచరణలోని రావాలని ఆకాంక్షించారు. ఉత్సవ సమితి అధ్యక్షుడు కర్నాటి విజయ్కుమార్తోపాటు సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా సభ వేదికపై ఓ విద్యార్థిని దేశ భక్తి గురించి ఉపన్యాసిస్తుండగా కొందరు పోకిరీ విద్యార్థులు కామెంట్ చేయడంతో గమనించిన లక్ష్మీనారాయణ ఆగ్ర హం వ్యక్తం చేశారు.
జాతీయ భావం పెంపొందించేందుకే
జనగణమన ఉత్సవ సమితి అధ్యక్షుడు కర్నాటి విజయ్కుమార్ మాట్లాడుతూ నేటి సమాజంలో జాతీయ భావం, దేశభక్తి పెంపొందిచేందుకు జనవరి 23, 2021న నేతాజీ జయంతి రోజు నల్లగొండలో నిత్య జాతీయ గీతాలపన ప్రారంభించామన్నారు. ఉత్సవ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి కొలనుపాక రవికుమార్ మాట్లాడుతూ నిత్య జాతీయ గీతాల ఉద్దేశంతోపాటు పలు అంశాలను వివరించారు. ఎన్జీ, ఉమెన్స్ కళాశాలల ప్రిన్సిపాల్ డాక్టర్ ఘన్శ్యాం మాట్లాడుతూ విద్యార్థులు దేశ భక్తిని కలిగి ఉత్తమ ప్రవర్తనతో ఉండాలన్నా రు. అదే విధంగా తల్లిదండ్రులు, గురువులను గౌరవించాలన్నారు. సభలో స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణ లో చిన్నారులు(విద్యార్థులు) అలరించారు. అలాగే విద్యార్థులు చేసిన సంస్కృతి, సంప్రదాయ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పాఠశాలల్లో విద్యార్థులకు నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో ఇంగ్లిష్, తెలు గు మీడియంలోవేర్వేరుగా విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో జనగణమన ఉత్సవ సమితి కోశాధికారి పోలోజు నాగేందర్, ఉపాధ్యక్షుడు పోలా జనార్ధన్, గంటి రామకృష్ణ, వంగర భరద్వాజ్, ఆర్కె వేదాంతం, ప్రదీప్,విద్యార్థులు పాల్గొన్నారు.