సూర్యాపేట సిటీ, డిసెంబర్ 20 : బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, మానవ అక్రమ రవాణా నిరోధం, తప్పిపోయిన బాలల గుర్తింపు, నిరాదరణకు గురైన పిల్లల సంరక్షణ లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఆపరేషన్ స్మైల్, జూలై నెలలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. జనవరి నెలలో నిర్వహించనున్న 10వ విడుత ఆపరేషన్ స్మైల్కు సంబంధించి అధికారులతో ఎస్పీ రాహుల్ హెగ్డే జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి మాట్లాడారు.
జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని, లక్ష్యం కోసం పని చేయాలని అన్నారు. జిల్లాలో ఆపరేషన్ స్మైల్ నిర్వహణకు సూర్యాపేట సబ్ డివిజన్, కోదాడ సబ్ డివిజన్ వారీగా పోలీస్ టీమ్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ పోలీస్ టీమ్స్ చైల్డ్ వెల్ఫేర్, లేబర్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ టీమ్స్, ఐసీడీఎస్, భరోసా సెంటర్ సిబ్బంది సమన్వయంతో పని చేసి నిరాదరణకు గురైన పిల్లలను గుర్తించాలన్నారు.
మెకానిక్ షాప్స్, ఇండస్ట్రీలు, వలస కూలీలు, ఇటుకల తయారీ పరిశ్రమలు, మైన్స్, హోటళ్లు, దాబాలు, ఇంతర అవుట్ లెట్స్ గోదాములు వంటి వాటిల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని సూచించారు. బాలలను వేధింపులకు గురి చేసినా, వెట్టి చాకిరీ చేయిస్తున్నా అలాంటి వారి సమాచారాన్ని పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అందజేయాలని ఎస్పీ కోరారు. సమాచారాన్ని డయల్ 100, చైల్డ్ హెల్ప్ లైన్ 1098కు సమాచారం అందించాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ నాగేశ్వర్రావు, డీఎస్పీ రవి, సీడబ్ల్యూసీ చైర్మన్ రమణారావు, లేబర్ కమిషనర్ మంజుల, డీఎంహెచ్ఓ డాక్టర్ కోటాచలం, జిల్లా సంక్షేమాధికారి జ్యోతిపద్మ, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు రవి కుమార్, నాగరాజు, నాగుల్ మీరా, పోలీస్ రెస్క్యూ టీమ్ పాల్గొన్నారు.