ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఎయిడ్స్ నియంత్రణకు వైద్య ఆరోగ్య శాఖ, ఎయిడ్స్ నియంత్రణ అధికారుల సమష్టి కృషి ఫలితంగా నల్లగొండ జిల్లాలో ఎయిడ్స్ తగ్గుముఖం పట్టింది. గతంలో ఎయిడ్స్పై అవగాహన లేకపోవడంతో విచ్చలవిడిగా పెరిగేది. ఈ వ్యాధికి మందు లేకపోవడం, నివారణ ఒక్కటే మార్గం కావడంతో ప్రజలను ఆ దిశగా చైతన్యం చేసిన అధికారులు ఏటేటా రోగుల సంఖ్యను తగ్గిస్తున్నారు. దాంతో జిల్లాలో హెచ్ఐవీ బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. 16 ఏండ్ల క్రితం 9 శాతంగా ఉన్న మహమ్మారి ప్రస్తుతం 0.5 శాతానికి తగ్గింది.
– నీలగిరి, నవంబర్ 30
బాధితుల సంరక్షణ ఇలా..
హెచ్ఐవీ పాజిటివ్ బాధితులను జిల్లా కేంద్రంలోని ఏఆర్టీ సెంటర్ లేదా సూర్యాపేటలోని ఏఆర్టీ సెంటర్కు పంపిస్తారు. వారికి అక్కడ వైద్యాధికారులు ఉచితంగా సీడీ4 పరీక్షలు చేసి కౌన్సెలింగ్ నిర్వహించి అవసరమైన మందులు ఉచితంగా అందజేస్తారు. 250 కంటే సీడీ4 కణాలు తక్కవగా ఉన్న వారికి ఎన్ఎన్ఆర్టీఐ, ఎన్ఆర్టీ మందులు అందజేస్తూ వారిని పరిశీలన, సంరక్షణ, కౌన్సెలింగ్ నిమిత్తం జిల్లాలోని మూడు ఆదరణ కేంద్రాలకు పంపిస్తారు. ఏఆర్టీఐ మందులను క్రమం తప్పకుండా 6 నెలలపాటు వాడిన బాధితులను దగ్గరలోని లింక్డు ఏఆర్టీ సెంటర్కు పంపించి ఉచిత మందులు పంపిణీ చేస్తారు. ఏఆర్టీ సెంటర్లలో క్రమం తప్పకుండా వాడిన వేలాది మంది హెచ్ఐవీ పాజిటివ్ బాధితుల్లో సీడీ4 బరువులో పెరుగుదల లేని వారికి వైద్యులు, కౌన్సిలర్లు పరీక్షించి సెకండ్ లెవల్ మందుల కోసం హైదరాబాద్లోని గాంధీ దవాఖానకు పంపిస్తారు. దాంతోపాటు జిల్లా వ్యాప్తంగా శుభం కార్యక్రమాలు, నల్లగొండ యూత్ పాజిటివ్ సొసైటీ, ఇతర స్వచ్ఛంద సంస్థలు, ఎయిడ్స్ నివారణ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తుండడంతో హెచ్ఐవీ పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.
బాధితులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం..
జిల్లాలో వలస కార్మికులు, లారీ డ్రైవర్ల కారణంగా ఎయిడ్స్ విస్తరించినట్లు అధికారులు గుర్తించారు. హెచ్ఐవీ సోకిన వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. జిల్లాలో 6,077 మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులుండగా 2,441మందికి రూ.2,016 చొప్పున పింఛన్ అందజేస్తున్నారు. వీరు కాకుండా మరో 2,541 మందికి పింఛన్ మంజూరు కోసం ప్రతిపాదనలు పంపారు. వ్యాధిగ్రస్తుల పిల్లలకు బాలల పరిరక్షణ సమితి ద్వారా 55 మందికి నెలకు రూ.1,000 చొప్పున సాయం అందిస్తున్నారు. ఈ సంవత్సరం జిల్లాలో 260 మందికి హెచ్ఐవీ సోకగా, వారిలో 39 మంది పాజిటివ్ గర్భిణులకు డెలివరీ చేసి చిన్నారులకు సోకకుండా 22 మందిని కాపాడారు. నల్లగొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ సురక్ష కేంద్రాల్లో 3,941 మంది సుఖవ్యాధులు, లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారిలో 2,726 మందికి చికిత్స అందించారు. జిల్లాలో హైరిస్క్లో భాగంగా 3,470 మంది సెక్స్వర్కర్లు, 1,528 స్వలింగ సంపర్కులు, 10 మంది లింగమార్పిడీదారులను గుర్తించి వారికి మూడు నెలలకోసారి ఆరోగ్య పరీక్షలు చేసి హెచ్ఐవీ సోకకుండా జాగ్రత్తలు చేపడుతున్నారు. ఏఆర్టీ సెంటర్కు వచ్చి మందులు వాడి మధ్యలో మానేసిన 415 మందికి అవగాహన కల్పించి తిరిగి మందులు వాడేలా జిల్లా యంత్రాంగం కృషి చేసింది.
జిల్లాలో 48 పరీక్ష కేంద్రాలు..
జిల్లా వ్యాప్తంగా పీపీటీసీటీలు 2, ఐసీటీసీలు 7, ఎఫ్ఐఐసీటీసీలు 30, పీపీపీలు 8, ఒక మొబైల్ ఐసీటీసీ సెంటర్తోపాటు మొత్తం 48 సెంటర్లలో హెచ్ఐవీ పరీక్షలు చేస్తున్నారు. జిల్లా కేంద్ర దవాఖానలో ఏఆర్టీ సెంటర్ నిర్వహిస్తున్నారు. దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రుల్లో మూడు లింక్డు ఏఆర్టీ సెంటర్లు ఉన్నాయి. వీటి ద్వారా ఎయిడ్స్ పాజిటివ్ బాధితులకు ఉచిత పరీక్షలతోపాటు మందులు ఇచ్చి వ్యక్తిగత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 36 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఫెసిలిటీ ఇంటిగ్రేటేడ్ కౌన్సెలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్ను(ఎఫ్ఐసీటీసీ)13 ప్రైవేట్ ఆస్పత్రుల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ సెంటర్లు(పీపీపీ) ఉన్నాయి. వీటి ద్వారా 9,928 మంది వ్యాధిగ్రస్తులు నమోదు చేసుకుని చికిత్స పొందుతున్నారు. ఈ పరీక్ష కేంద్రాల ద్వారా హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించడంతోపాటు గర్భిణులు, సామాన్య ప్రజలు, ప్రమాదకర ప్రవర్తన కల్గిన వ్యక్తులకు ఉచితంగా పరీక్షలు చేసి హెచ్ఐవీ పాజిటివ్ కలిగిన వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
నివారణ ఒక్కటే మార్గం
ఎయిడ్స్ను అవగాహనతోనే నివారించవచ్చు. సురక్షిత శృంగార పద్ధతులు పాటించాలి. సురక్షిత సిరంజులు వాడాలి. పాజిటివ్ వ్యక్తులు ఏఆర్టీ సెంటర్లలో అందజేసే మందులు క్రమం తప్పకుండా వాడితే జీవిత కాలాన్ని పెంచుకోవచ్చు. బోగస్ ప్రకటనలు నమ్మి మోసపోవద్దు. జిల్లాలో ఎయిడ్స్ నివారణ కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
– డాక్టర్ అన్నీమళ్ల కొండల్రావు, వైద్య ఆరోగ్యశాఖ అధికారి, నల్లగొండ