అడవిదేవులపల్లి, డిసెంబర్ 12 : అడవిదేవులపల్లి మండలం మొల్కచర్ల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యనందించడంతో పాటు ఇతర అంశాలపై కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తూ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం అందిస్తున్న నిధులు, ప్రజాప్రతినిధులు, దాతల విరాళాలతో పాఠశాలలో వసతులు సమకూర్చారు. సాంకేతిక విద్యను అందుబాటులోకి తెచ్చారు. అందమైన భవనం, ఆహ్లాదకరమైన వాతావరణంలో కార్పొరేట్ స్కూల్కు దీటుగా నిర్వహిస్తున్నారు.
పలు అవార్డులు
పాఠశాల భవనం పూర్తిగా రంగు లతో, విజ్ఞానం పంచేలా వివిధ రకాల పేయింటింగ్స్తో నింపారు. స్కూల్ ఆవరణలో వివిధ రకాల మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని అందుబాటులో ఉంచారు. స్వచ్ఛతను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. విద్యార్థుల కోసం నిర్మించిన మరుగుదొడ్లలో నల్లాలు, విద్యార్థులు చేతులు శుభ్రం చేసుకోవడానికి సబ్బులు ఏర్పాటు చేశారు. భోజనానికి ముందు చేతులు కడుక్కోవడానికి హ్యాండ్వాష్ను అందుబాటులో ఉంచారు. చుట్టూ పచ్చని చెట్లు, పరిశుభ్రమైన ఆవరణతో బడి ప్రకృతి ఒడిలో ఉన్నట్లుగా అనిపిస్తున్నది. పాఠశాలకు స్వచ్ఛతలో 2015 నుంచి వరుసగా జిల్లా, రాష్ట్రస్థాయి అవార్డులు వచ్చాయి. అవార్డుల ద్వారా వచ్చిన డబ్బులను కూడా వసతుల కల్పనకు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలో 80 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
కంప్యూటర్ విద్య
పాఠశాలలో దాతల సాయంతో కంప్యూటర్లు, ప్రొజెక్టర్ను ఏర్పాటు చేశారు. రోజు గంటపాటు కంప్యూటర్ విద్యను అందిస్తున్నారు. ప్రొజెక్టర్ ద్వారా వీడియో పాఠాలు బోధిస్తున్నారు. దాంతో విద్యార్థులు కూడా ఆసక్తిగా క్లాసులు వింటున్నారు. పుస్తకాల్లో ఉన్న పాఠాలతో పాటు అదనంగా జనరల్ నాలెడ్జి, ఇతర అంశాలపై కూడా వారిని తీర్చి దిద్దుతున్నారు.
ఉపాధ్యాయులు,దాతల సహకారంతోనే పాఠశాల అభివృద్ధిలో ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉంది. దాతల సహకారంతో ఆధునిక పరికరాలను సమకూర్చుకున్నాం. విద్యార్థులకు సాంకేతిక విద్యను కూడా అందిస్తున్నాం. ఉపాధ్యాయులు అదనపు సమయాన్ని కేటాయిస్తూ విద్యార్థులకు చదువు చెబుతున్నారు.