భువనగిరి కలెక్టరేట్, డిసెంబర్ 21 : మహిళల సంక్షేమం, వారి ఆర్థిక పురోభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు, కార్యక్రమాలు చేపడుతున్నది. ప్రతి మహిళ తన కాళ్ల మీద తాను నిలబడేలా సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందిస్తున్నది. మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలు అందించి ఎంతగానో తోడ్పడుతున్నది. ఇప్పటివరకు మహిళా సంఘాలు సమావేశం కావడానికి, చర్చించుకోవడానికి ప్రత్యేక భవనాలు లేవు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మహిళా వేదికలను నిర్మించేందుకు సన్నద్ధమవుతున్నది. మండలానికి ఒకటి చొప్పున నిర్మించి అందుబాటులోకి తేనున్నది. ఇందుకోసం కార్యాచరణ రూపొందిస్తున్నది. రైతు వేదికల మాదిరిగానే వీటిని నిర్మించి మహిళలకు ప్రయోజనం చేకూర్చనున్నది.
ప్రతి కార్యక్రమం తెలిసేలా..
ప్రతి మండలంలో మహిళా వేదిక నిర్మాణమైతే మహిళా సంఘంలోని ప్రతి సభ్యురాలికీ ప్రభుత్వం చేపట్టే పథకాలు, రుణాలు, తదితర విషయాలు తెలిసే అవకాశం ఉన్నది. ప్రభుత్వం బ్యాంకు లింకేజీల ద్వారా అందించే ఆర్థిక సహకారాలు, సమీక్షలు, సమావేశాలు, శిక్షణకు మహిళా వేదికలు దోహదపడనున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని 17మండలాలు ఉండగా అన్ని మండలాల్లో ఒక మహిళా వేదిక నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తున్నది. జిల్లాలోని 14,976 మహిళా సంఘాలకుగానూ 1,50,000 మంది సభ్యులున్నారు. గ్రామీణ మహిళలకు ఇవి ఎంతో ఉపయోగపడనున్నాయి.
ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం
ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం ఎంతో చేస్తున్నది. మహిళల ఆర్థికాభివృద్ధికి వడ్డీలేని రుణాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నది. ప్రతి మండలానికి ప్రభుత్వం ఒక మహిళా వేదిక ఏర్పాటు చేస్తామని చెప్పడం హర్షణీయం. మండలంలోని గ్రామాలకు చెందిన మహిళా సంఘాల ప్రతినిధులు, సభ్యులు ఒకే వేదిక వద్ద కూర్చొని చర్చించుకోవచ్చు. అవగాహన సదస్సులు, సమావేశాలకు వేదికలు ఉపయోగపడుతాయి.
– మేకల రేణుక, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు, శోభనాద్రిపురం
ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటాం
ప్రతి మహిళ ఆర్థికంగా ఎదుగాలని, తన కాళ్లపై తాను నిలబడాలని ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నది. రుణాలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్నది. మహిళల కోసం ఇన్ని చేస్తున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– బానోతు కవిత, జిల్లా సమాఖ్య కోశాధికారి, పెద్దపలుగుతండా