బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్జాం తుఫాన్ కారణంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముసురు పట్టింది. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపిలేకుండా చిరుజల్లులు కురిశాయి. ఈదురు గాలులతో వాతావరణం చల్లబడింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 19 డిగ్రీలకు పడిపోయాయి. చల్లటి గాలులకు జనం ఇంటికే పరిమితమయ్యారు. దాంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. వాతావరణ శాఖ నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్, సూర్యాపేట జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు. మంగళవారం అత్యధికంగా దామరచర్ల మండలంలో 18.2 మిల్లీమీటర్లు, అత్యల్పంగా దేవరకొండ మండలంలో 0.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షం యాసంగి పంటల సాగుకు సిద్ధమవుతున్న రైతులకు ప్రయోజనకరంగా ఉండనున్నది.
నీలగిరి, డిసెంబర్ 4: బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్జాం తుఫాన్ ప్రభావంతో జిల్లాలో ఎడతెరపి లేకుండా ముసురు కురుస్తున్నది. సోమవారం సా యంత్రం చిరుజల్లులతో ప్రారంభమైమంగళవారం రోజంతా మోస్తరు వర్షం కురిసింది. దాం తో ఉష్ణోగ్రత 19 డిగ్రీల కనిష్టానికి పడిపోయింది. ఉదయం నుంచి చలిగాలులు వీస్తుడడంతో చలి తీవ్రత పెరిగినందున పిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడి ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.
జిల్లాలో ఒక్కరోజే 202.2 మిల్లీ మీటర ్లవర్షం కురవగా సగటున 6.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా దామరచర్ల 18.2, అడవిదేవులపల్లిలో 16.4, చందంపేటలో 15.3 త్రిపురారంలో 14.1, మిర్యాలగూడలో 13.9, తిరమలగిరి(సాగర్)లో 10.6, పెద్ద అడిశర్లపల్లిలో 8.9, వేములపల్లిలో 8.2, మునుగోడులో 8.1, పెద్దవూరలో 7.4, అనుములలో 7.3, చండూర్లో 7.2, కొండమల్లేపల్లిలో6.7, గుర్రంపోడ్లో 5.4, నిడుమనూర్లో 5.4, మర్రిగూడలో4.8, నేరేడుగొమ్ములో4.2, తిప్పర్తిలో4.1, మాడ్గులపల్లిలో 4.1, గట్టుప్పల్లో4.0, నల్లగొండలో3.8, నకిరేకల్లో 3.8, కనగల్లో 3.5 చిట్యాలలో 3.4, గుండ్లపల్లిలో3.3, కేతేపల్లిలో 2.9,నాంపల్లిలో 2.4, శాలిగౌరారంలో 2.1, నార్కట్పల్లిలో 2.1, చింతపల్లిలో 1.8, కట్టంగూర్లో 1.1, దేవరకొండలో 0.6 మీల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది.
తుఫాన్ ప్రభావంతో మరో రెండ్రోజులు భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. ఈక్రమంలో వాతావరణ శాఖ సూర్యాపేట జిల్లాను ఆరెంజ్, నల్లగొండ జిల్లాను ఎల్లో జోన్గా ప్రకటించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర ప్రయాణాలు మాత్రమే చేసుకోవాలని, సాధ్యమైనంత వరకు ఇంటి నుంచి బయటకు రావద్దని సూచనలు చేశారు.
కట్టంగూర్: తుఫాన్ ప్రభావంతో నియోజకవర్గంలో మోస్తరు వర్షం కురుస్తున్నది. రామన్నపేట, చిట్యాల, నార్కట్పల్లి, కట్టంగూర్, నకిరేకల్, కేతేపల్లి మండలంలో సోమవారం అర్థరాత్రి నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి. ఈదురుగాలులు వీస్తుండడంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. విద్యుత్ అధికారులతో పాటు మండల స్థాయి అధికారులు గ్రామాల్లో అందుబాటులో ఉండాలని ఆయా మండలాల తాసీల్దార్లు ఆదేశించారు.
శాలిగౌరారం : మండల వ్యాప్తంగా మోస్తరు వాన కురిసింది. చల్లని గాలులతో ప్రజలు వణుకుతున్నారు. రైతులు మాత్రం తమ ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ యార్డ్లో అమ్మకానికి తెచ్చిన ధాన్యం తడవకుండా టార్ఫాలిన్లతో కప్పి జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రజలు బయటికి వెళ్లాలంటే ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మిర్యాలగూడ : నియోజక వర్గం వ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఆసాంతం ముసురు కురిసింది. వర్షానికి తోడు గాలులు వీస్తుండడంతో వాతావరణం చల్లబడింది. దాంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకి రావడానికి జంకుతున్నారు. ఇటీవల వానకాలం సాగు చేసిన వరి పంట చేతికి రావడంలో రైతులు యాసంగి దు క్కులు సిద్ధం చేసుకొంటున్నారు. ఈ సారి సాగర్ కాల్వకు నీరు విడుదల కాక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్న తరుణంలో వర్షం కురుస్తుండడంతో రైతులు ఉత్సాహంగా దుక్కులు సి ద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే దుక్కులు సిద్ధం చేసుకున్న రైతులు నాట్లు పెడుతున్నారు. పత్తి, మిర్చి పంటలతోపాటు, ఇంకను చేతికి రాని వరి పంటలకు వర్షంతో కొంత నష్టాన్ని కలిగించింది.
హాలియా/ నిడమనూరు : నాగార్జున సాగర్ నియోజకవర్గంలో సోమవారం అర్థరాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. దీంతో జనజీవనం స్తంభించింది. రోడ్లన్నీ బురదమయంగా మారాయి. డ్రైయినేజీ కాల్వల్లో నీళ్లు పొంగిపోర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు వచ్చి చేరింది. యాసంగి వరి నాట్లకు సిద్ధమవుతతున్న రైతులకు మేలు చేయగా వానకాలంలో వరి నాట్లు ఆలస్యంగా వేసి ఇప్పుడే వరి కోతలు కోస్తున్న రైతులను వర్షం ఇబ్బందులకు గురిచేసింది. వర్షం కారణంగా పాఠశాలల్లో విద్యార్థుల హాజరు గణనీయంగా తగ్గింది.