పెద్దఅడిశర్లపల్లి, జనవరి 14 : అన్నదాతల ఆశల సౌధం ఏఎమ్మార్పీ ఆయకట్టు పరిధిలో యాసంగి సాగు సందండి నెలకొంది. ఈనెల 1 నుంచి ఆయకట్టుకు నీరు విడుదల చేయడంతో అప్పటికే నారుమడులు సిద్ధం చేసుకున్న రైతులు పది రోజులుగా జోరుగా వరి నాట్లు వేస్తున్నారు. ఇప్పటికే మెట్ట పంటల సాగు ముగియడంతో ఆన్నదాతలు పూర్తిగా వరినాటు పనుల్లో నిమగ్నమయ్యారు. రైతు బంధు డబ్బులు ఖాతాలో జమ కావడంతో రైతులు జోరుగా వరి సాగు చేస్తున్నారు.
ఏఎమ్మార్పీ ఆయకట్టు పరిధిలో నిత్యం నాలుగు మోటర్ల ద్వారా 2400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రధాన కాల్వతోపాటు ప్రాజెక్టు పరిధిలోని 55 డిస్ట్రిబ్యూటరీలు 100 పైగా సబ్ డిస్ట్రిబ్యూటర్లు, మైనర్లకు నీటి విడుదల కొనసాగుతున్నది. దాంతోపాటు గతంలోనే చెరువులు నింపడంతో చెరువుల కింద ఆయకట్టు, బోరు బావుల కింద వరినాట్లు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఫేజ్ -2 పరిధిలోని కనగల్,గుర్రంపోడ్ పరిధిలో వరి నాట్లు పూర్తిగా కాగా పీఏపల్లి మండలంలో మాత్రం వారం రోజులుగా జోరుగా సాగుతున్నాయి.ప్రాజెక్టు పరిధిలో ఆరుతడితో పాటు రెండు లక్షల యాభై వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించగా దాదాపు 1.50 వేల ఎకరాలకు ప్రస్తుతం నీరు పూర్తిగా అందుతుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఇందులో అత్యధికంగా వరిసాగు చేస్తుండటం విశేషం. ముఖ్యంగా ప్రాజెక్టు క్రింద ప్రధాన చెరువులైన ఏకేబీఆర్, జి.యడవల్లి, కనగల్, అయిటిపాముల, చేపూర్, ఉదయ సముద్రం వంటి చెరువుల ఏఎమ్మార్పీ నీటితో నిండి ఉండడంతో ముందస్తుగానే వరినాట్లు వేశారు.
మద్దతు ధరతో వరి సాగుకు మొగ్గు
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు సాయం అందించడంతోపాటు ధాన్యం కొనుగొలు కేంద్రాల ద్వారా మద్దతు ధర అందిస్తుండటం, నీటి వసతి ఉండడంతో రైతులు వరి సాగుకు మొగ్గు చూపుతున్నారు. గత ఏడాది పీఏ పల్లి మండలంలో 14 వేల ఎకరాలు వరి సాగు చేయగా ఈ ఏడాది 16 ఎకరాలలో వరిసాగు చేస్తున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి పత్తి వంటి మెట్ట పంట సాగులో దిగుబడి లేక ఆదాయం తగ్గిపోవడంతో రైతులు వరి సాగుకు మొగు చూపుతున్నారు. దాంతో రోజురోజుకు ఆయకట్టులో విస్తీర్ణం పెరుగుతున్నది.
ఆధునిక యంత్రాల రాకతో ఉత్సాహం
ఆయకట్టు విస్తీర్ణం పెరగడంతో కూలీల కొరత తీవ్రంగా వేధిస్తున్న తరుణంలో రెతు ముంగిటకు అధునాతన యంత్రాలు వచ్చాయి. ఇప్పటివరకు వరికొత యంత్రాలు మాత్రమే అందుబాటులో ఉండగా తాజాగా ఆయకట్టు పరిధిలో నాటు వేసే యంత్రాలు వినియోగిస్తున్నారు. నిత్యం కూలీల కొరత, ఆర్థిక భారం పెరుగడంతో రైతులు వరినాటు యంత్రాలపై ఆధారపడుతున్నారు. మండలంలోని రైతులు ముందస్తుగా నారుమడి సిద్ధం చేసుకుని యంత్రంతో నాట్లు వేస్తున్నారు. దాంతో సుమారు వెయ్యి రూపాయల వరకు ఆదా అవుతున్నట్లు రైతులు చెబుతున్నారు. దీనికి తోడు క్రిమిసంహారక మందులు పిచికారీకి డ్రోన్లు సైతం అందుబాటులోకి రావడంతో ఉత్సాహంగా వరి సాగు చేస్తున్నారు.
అడుగుమందు బస్తాలకు సరిపడా పైసలు పడ్డయి
ఇప్పటీకే వరి నాటు వేసేందుకు దుక్కులు దున్నినాం. మరోరెండు రోజులో నాటు వేసేందుకు సిద్దంగా కాగా అడుమందు బస్తాలు ట్రాక్టర్ కిరాయిలకు సరిపడ రైతు బంధు పైసలు పడ్డాయి. పంట పండినంక సర్కార్ వడ్లు కొనడంతో మద్దతు ధర రందీ కూడా రైతుకు లేకూండా పోయింది. గత పది సంవత్సరాల నుండి ఐదు ఎకరాల వరిపంటనే సాగు చేస్తున్నాం.
– జానపాటి అంజయ్య, రైతు పీఏపల్లి
ప్రభుత్వం మద్దతు ధర అందిస్తుండటంతో వరి సాగు చేస్తున్నా..
ధాన్యానికి గతంలో మద్దతు ధర లేకపోవడంతో ఇబ్బందులకు గురైవాళ్లం. ఇప్పుడు రెండు పంటలను ప్రభుత్వమే మద్దతు ధర అందించి కొనుగొలు చేస్తుం డటంతో రైతులు వరి సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఆరు సంవత్సరాల నుంచి ఫుష్కలంగా వర్షాలు కురవడం, ప్రాజెక్టులు నిండటంతో అన్నదాతలకు కాలం కలిసి వస్తున్నది.
– కట్టెబోయిన ఎల్లేశ్, పీఏపల్లి
పంట దిగుబడి, మద్దతు ధరతోపెరుతున్న వరి సాగు విస్తీర్ణం
మండలంలో ప్రతి సీజన్కు ఆయకట్టు విస్తీర్ణం పెరుగుతున్నది. యాసంగితో పోలీస్తే వానకాలం రెండింతల పంట దిగుబడి వస్తు న్నది. గత యాసంగి లక్షా నలభై వేల క్వింటాళ్ల ధాన్యా న్ని ప్రభుత్వం కొనుగొలు చేసి సకాలంలో రైతుల ఖాతాలోకి డబ్బులు జమ చేసింది. దాంతో రైతులకు ధాన్యం మద్దతు ధరపై నమ్మకం కలిగి అత్యధికంగా 15వేల ఎకారాలపైగా వరి సాగు చేస్తున్నారు.
– ఏఓ పాండు, పీఏపల్లి