రామగిరి, డిసెంబర్ 31 : పురాతన శిలలు, కట్టడాలను కాపాడుకోవాలని ప్రముఖ పురావస్తు పరిశోధకుడు, చరిత్రకారుడు, ఫ్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని పానగల్ పరిసరాలు, వేంకటేశ్వరాలయం ఆవరణలోని శిథిలాలు, మెట్ల బావిని ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పానగల్లోని పచ్చల సోమేశ్వరాలయం ప్రవేశ ద్వారానికి కుడి వైపు ఉన్న మెట్ల బావికి 800 ఏండ్ల చరిత్ర ఉన్నదని, అది కందూరు చోళుల కాలం నాటి దిగుడు బావి అని తెలిపారు.
గతంలో అనేక సార్లు పునర్నిర్మాణం చేశారని, ప్రస్తుతం శిథిలావస్థ్ధకు చేరిందని, చారిత్రక ప్రాధాన్యత కలిగిన వీటిని కాపాడుకోవాలని అన్నారు. వేంకటేశ్వరస్వామి ఆలయం ఎదుట, మాణిక్యమ్మ గుడి ముందు ఉన్న కాకతీయుల కాలం మండప స్తంభం, విరిగిన చెన్నకేశవ శిల్పం, తల వరకు మాత్రమే కనబడుతున్న బ్రహ్మదేవుడి మూడు తలల భిన్నమైన శిల్పం, పానమట్టం అలనాటి శిల్పుల పనితనానికి అద్దం పడుతు న్నాయని చెప్పారు. ఎనిమిది శతాబ్దాల ఈ చారిత్రక ఆనవాళ్లపై అవగాహన కల్పించి భావితరాలకు అందించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట ఛాయా సోమేశ్వరాలయ కమిటీ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి, గ్రామస్తులు, యువకులు ఉన్నారు.