నీలగిరి, మార్చి 2 : పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్ని పోలియో కేంద్రాల్లో చుక్కలు వేయనున్నారు. అనంతరం 4,5 తేదీల్లో ఇంటింటికీ తిరిగి చుక్కలు వేయని వారికి వేస్తారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 1,61,925 మంది చిన్నారులను గుర్తించి నూరుశాతం పోలియో చుక్కలను వేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.
ఇందుకు 981 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేయగా నలుగురు పోగ్రాం అధికారులతోపాటు 3,924 మంది సిబ్బందిని నియమించారు. ఇవే కాకుండా 165 హైరిస్క్ ప్రాంతాలను గుర్తించి పోలియో చుక్కలు వేసేందుకు 39 మొబైల్ టీములతోపాటు 39 ట్రాన్సిట్లను ఏర్పాటు చేశారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు తదితర ప్రాంతాల్లో చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. పల్స్ పోలియో విజయవంతానికి ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నారు. గతంలో ప్రతి రెవెన్యూ డివిజన్కు ఒక ప్రత్యేక అధికారి పర్యవేక్షణకు ఉండగా ఈ సారి ఇద్దరి చొప్పున కేటాయించారు.
నల్లగొండ డివిజన్కు బి.అరుంధతిరెడ్డి, వేణుగోపాల్రెడ్డి, మిర్యాలగూడ డివిజన్కు ఎస్.గీతావాణి, రవి, దేవరకొండ డివిజన్కు కళ్యాణచక్రవవర్తి, కృష్ణకుమారిని నియమించారు. పోలియో రహిత దేశంగా మార్చేందుకు నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలతోపాటు ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని నల్లగొండ డీఎంహెచ్ఓ అన్నిమల్ల కొండల్రావు కోరారు.
బొడ్రాయిబజార్ : పల్స్ పోలియోకు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 591 కేంద్రాలను ఏర్పాటు చేశారు. సుమారు 95,281 మంది చిన్నారులను చుక్కలు వేసేందుకు గుర్తించారు. 2,364 మంది సిబ్బంది, 29 మొబైల్ టీమ్ప్ పని చేయనున్నారు. బస్స్టాండ్లు, కూడళ్లు వంటివి 11ప్రాంతాలు, హెచ్ఆర్ఏ పాయింట్లు 103 గుర్తించారు. పల్స్ పోలియోను విజయవంతం చేయాలని కోరుతూ శనివారం జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ నుంచి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించి మాట్లాడారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలం మాట్లాడుతూ అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేండ్ల చిన్నారుల వరకు పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఆదివారం వేయించుకోని వారికి సోమ, మంగళవారాల్లో చుక్కలు వేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ, అసంక్రమిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ కళ్యాణ్చక్రవర్తి, డెమో అంజయ్య, డాక్టర్లు హరిప్రసాద్, శివప్రసాద్, సుశాంక్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, యాకస్వామి, మత్స్యగిరి, ఉపేందర్ పాల్గొన్నారు.