నేటి నుంచి ధనుర్మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గోదాదేవి, రంగనాయకుడిపై రచించిన పాశురాలను రోజుకు ఒకటి చొప్పున 30 రోజులపాటు పఠిస్తూ అర్చకులు మార్గళి పూజలు చేపట్టనున్నారు.
యాదాద్రి, డిసెంబర్15 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో శుక్రవారం నుంచి ధనుర్మాసోత్సవాలు నిర్వహించనున్నారు. ప్రధానాలయ మొదటి ప్రాకార మండపంలో సాయంత్రం 5.30 గంటలకు అర్చకులు వేద మంత్రాలు పటిస్తూ అమ్మవార్లకు తిరుప్పావై పూజలు నిర్వహించనున్నారు. ధనుర్మాస విశిష్టతను భక్తులకు వివరిస్తారు. గోదాదేవి, రంగనాయకుడిపై రచించిన పాశురాలను రోజుకు ఒకటి చొప్పున 30 రోజులపాటు పఠిస్తూ అర్చకులు మార్గళి పూజలు నిర్వహించనున్నారు. జనవరి 14న గోదాదేవి కల్యాణం, 15న అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారి ఊంజల్ సేవను సాయంత్రం 4.30 గంటలకు నిర్వహించనున్నటుల ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
గురువారం తెల్లవారు జామున స్వయంభూ ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలి అనంతరం తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. నిజరూప దర్శనంలో స్వయంభూ నారసింహులు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు.
ప్రధానాలయ మొదటి ప్రాకార మండపంలో సుదర్శ నారసింహ హోమం జరిపిన అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై వేంచేపు చేసి వెలుపలి ప్రాకార మండపంలో ఊరేగించారు. స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం జరిపించారు. కల్యాణోత్సవంలో భక్తులు పాల్గొని కల్యాణ తంతును వీక్షించారు. ప్రధానాలయ ముఖమండపంలో స్వామివారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా భక్తులకు సువర్ణ పుష్పార్చన జరిపించారు.
బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. సాయంత్రం స్వామివారికి తిరువీధి, దర్బార్ సేవలు వైభవంగా చేపట్టారు. రాత్రి తిరువరాధన అనంతరం స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన నిర్వహించారు. పాతగుట్టలో స్వామివారికి నిత్యారాధనలు వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 15 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి స్వామివారి ఖజానాకు రూ.21,15,527 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
యాదాద్రి ఆలయ వైకుంఠ ద్వారం నుంచి వడాయిగూడెం చౌరస్తా వరకు బిగించిన సెంట్రల్ లైటింగ్ స్తంభాలకు గురువారం వైటీడీఏ అధికారులు మీటర్లను బిగించారు. మొత్తం 22 స్తంభాలకు 4 విద్యుత్ మీటర్లు అమర్చారు. శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు లైటింగ్ను ప్రారంభించనున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధాహేమేందర్గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రవణ్కుమార్రెడ్డి, వైటీడీఏ ఈఈ వీరేందర్, ఏడీ సూర్యానాయక్, ఏఈలు నరేశ్, సురేశ్, శ్రీనాథ్ పాల్గొన్నారు.
లక్ష్మీనరసింహస్వామిని మానవ హక్కుల కమిషన్ సభ్యుడు నడిపల్లి ఆనందరావు కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు ఆలయ సంప్రదాయరీతిలో స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, ఏఈఓ రఘు స్వామివారి ప్రసాదం అందజేశారు. అనంతరం ఆలయ దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి రూ.50,202 నగదు, రూ.1,00,116 చెక్కును ఆలయ ఏఈఓ రఘుకు అందజేశారు.
ప్రధాన బుకింగ్ ద్వారా 1,28,400
వీఐపీ దర్శనాలు 45,000
బ్రేక్ దర్శనాలు 1,20,600
వేద ఆశీర్వచనం 15,000
నిత్య కైంకర్యాలు 1,100
సుప్రభాతం 300
ప్రచార శాఖ 77,050
వ్రత పూజలు 1,10,600
కల్యాణకట్ట టిక్కెట్లు 57,000
ప్రసాద విక్రయం 9,67,900
వాహన పూజలు 11,700
అన్నదాన విరాళం 11,725
శాశ్వత పూజలు 5,000
సువర్ణ పుష్పార్చన 81,748
యాదరుషి నిలయం 61,076
పాతగుట్ట నుంచి 31,420
కొండపైకి వాహన ప్రవేశం 2,00,000
శివాలయం 5,200
ఇతర విభాగాలు 1,83,608