నార్కట్పల్లి, ఫిబ్రవరి 19 : ఓం నమః శివాయ, శంభో శంకర, హరహర మహా దేవ అంటూ కణకణ మండే నిప్పుల గుండం నుంచి భక్తులు నడిచారు. చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థాన కల్యాణ మండపం ఎదుట సోమవారం తెల్లవారుజామున అగ్ని గుండాల మహోత్సవం భక్తి శ్రద్ధలతో సాగింది. శివ సత్తుల నాట్య విన్యాసాలు, ఆట పాటలతో భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తింది. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని అగ్ని గుండాల నుంచి నడిచేందుకు పోటీపడ్డారు. తెలిసీ తెలియక చేసిన పాపాలు అగ్నితో దహింపజేయాలని వేడుకుంటూ నిప్పుల్లో నడిచారు.
పంటలు బాగా పండాలని, కాలం సమృద్ధిగా కావాలని రైతులు తీసుకొచ్చిన ఆముదాలు, పత్తి, కందులు, మినుములు తదితర ధాన్యాలు అగ్ని గుండంలో వేసి పరమ శివుడిని కొలిచారు. అంతకుముందు పర్వత వాహనంపై ఆసీనులైన పార్వతీ రామలింగేశ్వరులను మంగళవాయిద్యాల నడుమ అగ్ని గుండాల వద్దకు తీసుకొచ్చిన ఆలయ ప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ హారతి నివేదించారు. అగ్ని దేవుడికి ఆవాహనం చేసి నిప్పుల గుండం వెలిగించారు.
అనంతరం నిప్పులపై నుంచి ప్రధాన అర్చకుడితోపాటు భక్తులు నడిచారు. అగ్ని గుండాల వద్ద అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. దేవాదాయ సహాయక కమిషనర్ మహేంద్ర కుమార్, ఆలయ ఇన్చార్జి ఈఓ నవీన్, ఆలయ సిబ్బంది భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపట్టారు. అగ్ని గుండాల కార్యక్రమానికి హాజరైన భక్తులు స్వామి వారికి కానుకలు సమర్పించారు. రూ. 60,500 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారి తెలిపారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారి ఏకాంత సేవ, పుప్పోత్సవాన్ని నిర్వహించనున్నారు. స్వామివారికి అష్టోత్తర శత కలశాలతో అభిషేకం, సూర్య నమస్కారాలు, దీక్షా హోమాలు, బలిహరణ, జయాధి హోమం, మహా పూర్ణాహుతి, ధ్వజారోహణం, త్రిశూల స్నానం, వసంతోత్సవం, నీరాజన మంత్ర పుష్పం, క్షేత్ర పాలక అభిషేకాలు జరిపించనున్నారు.