చౌటుప్పల్, జూలై 15 :మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్లక్ష్యంవల్లే చౌటుప్పల్- వలిగొండ రహదారి పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నదని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ రహదారి నిర్మాణానికి అనుమతులు తెచ్చినా ఇప్పటికీ పనులు పూర్తి కావడంలేదని మండిపడ్డారు. బుధవారం చౌటుప్పల్లోని వలిగొండ రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయన రోడ్డుపై ధర్నాకు దిగారు. అంతకుముందు ఆయన రహదారిని పరిశీలించారు. అక్కడ జరుగుతున్న కల్వర్టు పనులను కూడా పరిశీలించారు.
ఆనంతరం ఆయన మాట్లాడుతూ మొండికుంట కాల్వపై నిర్మిస్తున్న కల్వర్టులో మూడు వెంట్లు నిర్మిస్తే భారీ వర్షాలు వస్తే కాల్వ నీరు సరిగా వెళ్లక వెనుక ఉన్న కాలనీలు నీట మునిగే ప్రమాదం ఉందన్నారు. దీంతో మూడు వెంట్లు కాకుండా ఆరు వెంట్లు నిర్మించాలని సూచించారు. దీనికితోడు కాల్వను కబ్జాచేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఓ వార్డు కౌన్సిలర్ 200 గజాలకు అనుమతి తీసుకొని కాల్వకు ఆనుకోని దాదావు 500 గజాల్లో భారీ భవనం నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్ చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని కూసుకుంట్ల విమర్శించారు. జిల్లా కలెక్టర్కు బీఆర్ఎస్, బీజేపీ వార్డు కౌన్సిలర్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి కారణంగానే అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు.
మంత్రి పదవిపైనే రాజగోపాల్ రెడ్డి దృష్టి..
స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రజా సమస్యలపై కన్నా మంత్రి పదవిపైనే ఎక్కువ దృష్టి పెట్టారని కూసుకుంట్ల విమర్శించారు. ఎమ్మెల్యేగా ఆయన చేసిన అభివృద్ధి ఏమీ లేదని, మంత్రిగా ఏం ఒరగపెడతారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు అక్రమ వసూళ్లు, అవినీతికి పాల్పడుతున్నారని, ఇందుకోసమే అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని కూసుకుంట్ల ఆరోపించారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గిర్కటి నిరంజన్ గౌడ్, మున్సిపల్ కన్వీనర్ బొమ్మిరెడ్డి వెంకట్ రెడ్డి, మున్సిపల్ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కొయ్యడ శేఖర్ గౌడ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు సుర్వి మల్లేశం గౌడ్, వార్డు కౌన్సిలర్లు ఊదరి యాదయ్య, గడ్డం ఇందిర రాజరత్నం, నాయకులు తాడూరి పరమేశ్, ఢిల్లీ మాధవరెడ్డి, ఊడుగు మల్లేశం గౌడ్, దేవరపల్లి గోవర్దన్ రెడ్డి, కళ్లెం శ్రీనివాస్ రెడ్డి, ముప్పిడి శ్రీనివాస్ గౌడ్, కొత్త పర్వతాలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.