నేరేడుచర్ల/ హుజూర్నగర్, డిసెంబర్ 17 : నేటి సమాజంలో ఆధార్ కార్డు వినియోగం ఎంత కీలకంగా మారిందో ప్రతి ఒక్కరికీ తెలుసు. సిమ్ కార్డు కొనుగోలు మొదలు బ్యాంకు ఖాతాలు తెరువడం, వాహనాలు, ఇండ్లు, భూముల క్రయ విక్రయాలు.. ప్రభుత్వ పథకాలు, విద్యార్థులకు స్కాలర్షిప్ వంటి వాటికి అధార్ తప్పనిసరి అయ్యింది. అయితే.. వయసు పెరుగుతున్నా కొద్దీ వ్యక్తుల ముఖాల్లో తేడాలు వస్తుండడం సర్వసాధారణం. దీంతోపాటు ఇంటి చిరునామాలు మారుతుండడంతో అటు అధికారులు, ఇటు ఆధార్ కార్డుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిని పరిష్కరించేందుకు ఆధార్లో మార్పులు, చేర్పులకు యూఐడీఏఐ ఎప్పటికప్పుడు అవకాశం కల్పిస్తూ వస్తున్నది.
ఈ క్రమంలో గతేడాది డిసెంబర్ నుంచి మూడు నెలలపాటు ఉచితంగా మార్పులు, చేర్పులు చేసుకోవచ్చంటూ ప్రకటించింది. అయితే ప్రజలు అంతగా ఆసక్తి కనబర్చకపోవడంతో ఆశించిన మేర మార్పులు చేసుకోలేదు. ఈ నేపథ్యంలో మరో మూడు నెలలు గడువు పొడిగిస్తూ ఈ నెల 14వరకు అవకాశం ఇచ్చింది. అయినా.. ఇంకా పదేండ్ల గడువు ముగిసిన వారు భారీ సంఖ్యలోనే ఉండడంతో మరోసారి ఆధార్ అప్డేట్కు గడువు పొడిగించింది. వచ్చే ఏడాది మార్చి వరకు ఆధార్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించింది.
చాలా ఏండ్లుగా ఆధార్లో కొన్ని మార్పులకు యూఐడీఏఐ అవకాశం కల్పించలేదు. అందులో ప్రధానంగా 2010-18 వరకు ఆధార్ నమోదు చేసుకున్న కార్డుదారులు బంధుత్వాల్లో మార్పులు చేసుకోవాల్సి ఉన్నది. తండ్రి (సన్ ఆఫ్), భర్త (వైఫ్ ఆప్) వంటి వాటిని ఇప్పుడు మార్చుకోవచ్చు. ప్రస్తుతం దీనికి ఆయా స్థానాల్లో కేరాఫ్గా కొనసాగిస్తున్నారు. ఆధార్ నవీకరణ బంధుత్వాల మార్పుతోపాటు ఫోన్ నెంబర్లు, పుట్టిన తేదీ, ఫొటో, చిరునామా వంటివి అప్డేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రజలు తమ పదో తరగతి, పాన్, ఓటర్ కార్డు, పాస్పోర్టు ఏదో ఒకటి జతపర్చాలి. ఇందులో చిన్నారులకు వారి తల్లిదండ్రుల చేతి ముద్రలతో ఆధార్ కార్డు జారీ చేశారు. వారికి ఐదేండ్లు పూర్తయ్యాక వారి వేలిముద్రలు, ఫొటోలను అప్డేట్ చేసుకోవాలి. దీనిపై చాలా మందికి అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు.
పిల్లల జనన ధ్రువీకరణ పత్రంలోనూ అప్డేట్ చేయించుకోవాలి. కాగా, 70 ఏండ్లు దాటిన వారికి అప్డేట్ నుంచి మినహాయింపు కల్పించారు. ఎలాంటి రుసుము చెల్లించకుండా ఆన్లైన్లో ఆధార్ కార్డును స్వతహాగా అప్డేట్ చేసుకోవచ్చు. కంప్యూటర్ పట్ల అవగాహన ఉన్నవారు మై ఆధార్ పోర్టల్, ఎం-ఆధార్ యాప్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే మండలాల్లోని శాశ్వత ఆధార్ కేంద్రాల్లోనూ మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. చిన్నారులకు కార్డు తీసుకొని ఐదేండ్లు దాటితే వేలిముద్రలు, ఫొటోలను కూడా అప్డేట్ చేసుకోవచ్చు. పోస్టాఫీసులు, బ్యాంకులు, శాశ్వత ఆధార్ కేంద్రాల్లో తగిన డాక్యుమెంట్లు అందజేసి అప్డేట్ చేసుకోవాలి.
పదేండ్ల కింద ఆధార్ కార్డు పొందిన వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విశిష్ట గుర్తింపు ఉపాధికార సంస్థ (యూఐడీఏఐ) సూచిస్తున్నది. గడువు ముగిసిన అనంతరం అప్డేట్తోపాటు ఫొటో, నివాసం, ఇతర మార్పులు, చేర్పులు చేసుకోవాలంటే విధిగా 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. ఆధార్ అప్డేట్ కోసం మీసేవ కేంద్రాల్లో రుసుము వసూళ్లపై నిబంధనలు జారీ చేశారు. బయోమెట్రిక్ అప్డేట్కు రూ.100, డెమోగ్రాఫిక్కు రూ.50, ఆధార్ డౌన్లోడ్, కలర్ ప్రింట్కు రూ.30 చెల్లించాలి. ఇందులో ఏమైనా సమస్యలు తలెత్తితే టోల్ ఫ్రీ నంబర్ 1947లో సంప్రదించవచ్చు.
https:// myaadhaar.uidai.gov.in పోర్టల్లో ఆధార్ నంబర్ ద్వారా లాగిన్ కావాలి. ప్రొసీడ్ టు అప్డేట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన అనంతరం డాక్యుమెంట్ అప్డేట్ ఆప్షన్ను క్లిక్ చేస్తే స్క్రీన్పై వివరాలు వస్తాయి. వాటిని పూర్తిగా పరిశీలించి సవరణ ఉంటే చేయాలి. లేదంటే ఉన్న వివరాలతోనే నెక్ట్స్పై క్లిక్ చేయాలి. కిందికి స్క్రోలింగ్ చేస్తే వచ్చే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్లను ఎంచుకోవాలి. ఆయా డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ బటన్పై క్లిక్ చేస్తే అప్డేట్ పూర్తయినట్లు పోన్ నెంబర్కు పద్నాలుగు అంకెల అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్ వస్తుంది. దీని ద్వారా స్టేటస్ తెలుసుకోవచ్చు.