నల్లగొండ, జనవరి 8 : జనవరి 1 నుంచి ఫిబ్రవరి 29 వరకు సహకార బ్యాంకుల పరిధిలో డిపాజిట్ల సేకరణ మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో 2024 డైరీ, క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు నెలల పాటు సహకార బ్యాంకుల్లో డిపాజిట్ల మాసోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు, పాలకవర్గ సభ్యులు డిపాజిట్లను ప్రోత్సహించాలని సూచించారు.
ప్రస్తుతం డీసీసీబీలో రూ.665 కోట్ల డిపాజిట్లు ఉంటే, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.103 కోట్లు సేకరించినట్లు తెలిపారు. ఇంకా మూడు నెలల సమయం ఉన్నందున మరిన్ని డిపాజిట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అలాగే బంగారు రుణాల విషయంలో ఏ బ్యాంకులు కూడా ఇవ్వని విధంగా గ్రాముకు రూ.4,500 రుణం ఇవ్వడంతోపాటు 9.9 శాతం మాత్రమే వడ్డీ విధిస్తున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం డిపాజిట్ల మాసోత్సవాల్లో భాగంగా ధన సమృద్ధి డిపాజిట్ కింద 333 రోజులకు గానూ 7.75 శాతం, ధనవర్ష డిపాజిట్ కింద 111 రోజులకు 6.50 శాతం వడ్డీ ఇవ్వనున్నట్లు తెలిపారు. డిపాజిట్లపై ఐదు లక్షల వరకు బీమా సౌకర్యం ఉందని, కేవలం పది నిమిషాల్లోనే రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డైరెక్టర్లు పాశం సంపత్రెడ్డి, సైదులు, అంజయ్య, రంగాచారి, రాంచందర్, జయరాం, శ్రీనివాస్, కరుణ, అనూరాధ పాల్గొన్నారు.