ఉమ్మడి రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి ్రప్రాంతంలో కరువు తాండవించింది. నాటి సీమా్ంరధ్ర పాలకులు పట్టించుకోకపోవడంతో రైతులకు అరిగోస తప్పలేదు. వ్యవసాయ బావులు, బోర్లు వట్టిపోయాయి. వ్యవసాయం పూర్తిగా దెబ్బతింది. పాడి పరిశ్రమ ఆగమైంది. కరువుతో పొలాలు ఎండిపోయి పశువులకు మేత కరువయ్యేది. పశువుల వైద్యం కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటు పంటలు పండక, అటు పాడి పరిశ్రమకు సర్కారు చేయూత లేక చాలా కుటుంబాలు వలస వెళ్లాయి. కానీ, కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు మారాయి. పాడి పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత అందించింది. అనేక విధాలుగా ఆదుకున్నది. పశువులకు మేత నుంచి వైద్యం వరకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నది.
స్వరాష్ట్రంలో పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. గతానికి భిన్నంగా పరిశ్రమ అభివృద్ధి చెందింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 1.50 లక్షల వరకు పాలిచ్చే ఆవులు, బర్రెలు ఉన్నాయి. వీటి నుంచి ప్రతి రోజూ సుమారు 5.50 లక్షల లీటర్లకు పైగానే పాలు ఉత్పత్తి అవుతున్నాయి. గతంలో ఇందులో సగం కూడా ఉత్పత్తి అయ్యేది కాదని అధికారులు చెబుతున్నారు. వీటిని విజయ, నార్ముల్ డెయిరీలకు సరఫరా చేస్తారు. ఒక్కో లీటరుకు రూ.50 నుంచి 60 వరకు విక్రయిస్తున్నారు. ఇక ప్రైవేట్గా రూ.70 నుంచి 80 వరకు అమ్ముతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో పాల ఉత్పత్తి పెరుగడంతో రాష్ట్రంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా టాప్ ప్లేస్లో నిలిచింది. జిల్లాలోని భువనగిరి, యాదగిరిగుట్ట, బీబీనగర్, తుర్కపల్లి, బొమ్మలరామారం, ఆలేరు, మోటకొండూరు తదితర మండలాల్లో పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది.
గతంలో నెలకొన్న కరువు పరిస్థితులను అధిగమించడానికి, పాడి పరిశ్రమతో రైతులకు జీవనోపాధి కల్పించడానికి పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నది. జిల్లాలోని ఆవులు, బర్రెలకు కృత్రిమ గర్భధారణ ద్వారా మేలు జాతి దూడలను పుట్టించి.. అధిక పాలు ఇచ్చే జాతులుగా అభివృద్ధి పరుస్తున్నది. రూ.40లకే మేలు జాతి వీర్యం అందిస్తున్నది. జిల్లాలో 31 వెటర్నరీ వైద్య పోస్టులు ఉండగా 31మంది అందుబాటులో ఉన్నారు. పశువులు రోగాల బారిన పడకుండా ముందు జాగ్రత్తగా టీకాలు వేయడం, నట్టల నివారణ మందులు తాగించడంతోపాటు రోగాల బారిన పడిన పశువులకు సమయానికి చికిత్స అందిస్తున్నారు. గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నారు. ఇప్పటికే 60 శాతం పశువులకు ఈ ప్రక్రియ పూర్తయ్యింది. పశువుల కోసం పశుసంచార వైద్య శాలలు నడుస్తున్నాయి. వైద్యులు ఇంటికే వచ్చి చికిత్స అందిస్తున్నారు. అవసరమైన వాటికి మందులు ఇస్తున్నారు. ఇక మినరల్ మిక్చర్(ఖనిజ లవణాలు)ను సరఫరా చేస్తున్నారు.
పాడి రైతులను ప్రోత్సహించేందుకు వివిధ డెయిరీలు ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి. విజయ, మదర్ డెయిరీలు రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. మదర్ డెయిరీ పాలు తమ డెయిరీలకు విక్రయిస్తే.. లీటరుకు అదనంగా రూ.4 ఇస్తున్నది. పాలు పోస్తున్న రైతు కుటుంబలో ఎవరి వివాహం జరిగినా సమాఖ్య ద్వారా రూ.5 వేల సాయం చేస్తున్నది. డెయిరీలు దాణా, మందులకు సైతం రాయితీలు ఇస్తున్నాయి. పాలు పోసే రైతు ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ.5 వేల వైకుంఠ యాత్ర ఖర్చులను అందిస్తూ అండగా నిలుస్తున్నాయి. ఇక డెయిరీలే పశువులకు బీమా ప్రీమియం చెల్లిస్తున్నాయి. పశువులు చనిపోతే బీమా సదుపాయం ఉంది.
ఆవులు, బర్రెల నుంచి ఎక్కువ మొత్తంలో పాల ఉత్పత్తి జరుగాలంటే మంచి ఆహారం అవసరం. ముఖ్యంగా పచ్చిగడ్డి ఎంతో ముఖ్యం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పాడి రైతులకు 75 శాతం సబ్సిడీతో పచ్చిగడ్డి విత్తనాలను అందిస్తున్నది. గతేడాది 110 టన్నుల పచ్చిగడ్డి విత్తనాలను సరఫరా చేసింది. ఇందులో రాష్ట్రంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. దీంతో పాడి రైతులకు గడ్డి కొరత లేకుండా పోయింది. సరిపడా మేత ఉండటంతో ఆవులు, బర్రెలు అధిక మొత్తంలో పాలు ఇస్తున్నాయి.
తెలంగాణ ఏర్పడిన కొత్తలో పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టింది. పాల ఉత్పత్తిని పెంచేందుకు బర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. 2018 ఆగస్టులో ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఒక్కో యూనిట్ విలువ రూ.80 వేలతో పాడి రైతులకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 75 శాతం సబ్సిడీపై బర్రెలు, ఆవులను పంపిణీ చేశారు. జిల్లాలో మొత్తంగా 6,896 మంది పాడి రైతులకు ఆవులు, బర్రెలు అందించారు. ఇక కరోనా నేపథ్యంలో లాక్డౌన్తో ఆర్థికంగా కుదేలైన పాడి రైతులను ఆదుకునేందుకు ప్రత్యేకంగా కిసాన్ క్రెడిట్ కార్డులను అందించింది. వీటి ద్వారా బ్యాంక్ నుంచి నేరుగా రుణాలు పొందారు.
పాడి రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుంది. పాల ఉత్పత్తి పెంపుపై పాడి రైతులకు పూర్తి స్థాయిలో ప్రభుత్వమే అవగాహన కల్పించడం అభినందనీయం. డెయిరీల్లో పాలు పోసిన రైతులకు 15 రోజులకోసారి డబ్బులు అందజేస్తున్నారు. అలాగే డెయిరీ సంస్థల నుంచి బర్రెలు, ఆవులను అందజేయటంతోపాటు లీటరుకు రూ.4 ప్రోత్సాహం అందిస్తున్నారు. అలాగే సబ్సిడీపై గడ్డి విత్తనాలు, దాణా, మినరల్ మిక్షర్, కాల్షియం అందించడం హర్షణీయం. పశు వైద్యాధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ పాడి పశువులకు మొబైల్ వైద్య సేవలు అందిస్తున్నారు. పాడి రైతుల సంక్షేమానికి పాటుపడుతున్న ప్రభుత్వానికి పాడి రైతులంతా ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు.
-చింతలపూరి వెంకట్రాంరెడ్డి, మదర్ డెయిరీ డైరెక్టర్, రేణికుంట, రాజాపేట
వ్యవసాయ రంగంలో భాగమైన పాడి పరిశ్రమ అభివృద్ధిపై బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో పశుపోషణ, పశువులకు సోకే వ్యాధుల పట్ల వైద్యులు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తూ ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. పాల ధరలు సైతం సంతృప్తికరంగా ఉండడంతోపాటు లీటరుకు రూ.4 ప్రోత్సాహం అందిస్తూ రైతాంగానికి అండగా నిలుస్తుంది.
-కొడారి రామస్వామి, పాడి రైతు, దత్తాయపల్లి, తుర్కపల్లి