యాదాద్రి, ఆగస్టు 17 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి నిత్యారాధన పర్వాలు బుధవారం శాస్ర్తోక్తంగా జరిపించారు. అర్చకులు ఉదయాన్నే ఆలయాన్ని తెరిచి సుప్రభాతం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు తిరువారాధన, స్వామికి బాలబోగం నివేదన జరిపి నిత్యబలి ప్రదానం మంగళశాసనంతో ప్రాబోదిక కార్యక్రమం ముగింపు పలికి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం స్వామికి నిజాభిషేకం చేశారు. స్వామికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన హోమంతో శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై మండపంలో ఊరేగించారు.
లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా నిత్య తిరుకల్యాణ తంతును జరిపారు. సాయంత్రం వేళలో స్వామి వారి వెండి మొక్కు జోడు, దర్బార్ సేవ ఘనంగా నిర్వహించారు. రాత్రి 7గంటలకు స్వామివారికి తిరువారాధన చేపట్టి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన జరిపారు. కొండపైన ఉన్న పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన చేశారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చన చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.14,84,682 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
70లక్షలకు చేరిన లక్ష్మీ నామస్మరణ
శ్రావణమాసం సందర్భంగా యాదగిరిగుట్ట క్షేత్రంలో చేపట్టిన ‘శ్రావణలక్ష్మి కోటికుంకుమార్చన’ కార్యక్రమం బుధవారానికి 20వ రోజుకు చేరింది. అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొన్న భక్తులకు అర్చకులు కుంకుమ ప్రసాదం, స్వామివారి శెల్లా, అమ్మవారి కనుము, స్వామివారి ప్రసాదం అందించారు. ఇందులో భాగంగా లక్ష్మి అమ్మవారికి భక్తులకు అభయవర ప్రదానం చేసే శక్తిని కల్పించేందుకు లక్ష్మీ నామస్మరణ చేపట్టారు. రోజుకు 3.60లక్షల నామాలను స్మరిస్తుండగా ఇప్పటి వరకు 70లక్షల లక్ష్మీ నామస్మరణ పూర్తి చేసినట్లు ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనర్సిసింహాచార్యులు తెలిపారు. ఈ నెల 27వరకు 1.08కోట్ల నామస్మరణతో అమ్మవారికి కోటి జపం పూర్తి చేస్తామన్నారు.
క్రీడాపోటీలు.. రక్తదానాలు
75వ స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం ఆధ్వర్యంలో ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. క్యారమ్, చెస్ పోటీలు నిర్వహించి విజేతలకు ఆలయ ఈఓ ఎన్.గీత జ్ఞాపికలు అందించారు. కొండకింద నృసింహస్వామి సదనంలోఎంఎస్ఎన్ బ్లడ్ బ్యాంకు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. 18మంది దేవస్థాన సిబ్బంది రక్తదానం చేశారు.
యాదాద్రి అతిథి గృహాన్ని పరిశీలించిన వైటీడీఏ వైస్ చైర్మన్
యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణంలో భాగంగా టెంపుల్ సిటీపై నిర్మిస్తున్న వైటీడీఏ యాదార్షి అతిథి గృహాన్ని వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావు బుధవారం పరిశీలించారు. దాదాపుగా పూర్తైన నాలుగు పడక గదులు, విశాలమైన సమావేశ హాల్ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వివిధ రాష్ర్టాలు, దేశాల నుంచి ఆలయానికి వచ్చే వీవీఐపీల విడిది కోసం కేటాయించేందుకు ఈ అతిథి గృహాన్ని నిర్మిస్తున్నారు. 5వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన భవనం చుట్టూ పచ్చదనం ఉండేలా చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా చేపట్టిన రోడ్డు నిర్మాణాల్లో అవకతవకలు జరుగుతున్నాయని వస్తున్న ఆరోపణలు నిజం కాదని పేర్కొన్నారు. వైటీడీఏ అనుమతితో ఆర్అండ్బీ శాఖ పనులు చేపట్టిందన్నారు. టెండర్ ప్రక్రియతోనే ఆర్అండ్బీ అధికారులు పనులు చేపట్టారని తెలిపారు.