డిండి, మార్చి 26 : నల్లగొండ జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టుల్లో ఒకటైన డిండి ఆయకట్టుకు ఈ సంవత్సరం దండిగా సాగునీరందుతున్నది. నలభై సంవత్సరాల తర్వాత వరుసగా వానకాలం, యాసంగి సీజన్లకు సాగునీటిని విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాగునీరు పుష్కలంగా రావడంతో ఆయకట్టు రైతులు 12వేల ఎకరాల్లో వరిసాగు చేశారు.
గతంలో ఒక్క కారుకే..
1943లో నిజాం కాలంలో డిండి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. 33 అడుగుల ఎత్తు, రెండు టీఎంసీల సామర్థ్యంతో 12 వేల ఎకరాల అయకట్టుకు సాగునీరందించేందుకు వీలుగా ప్రాజెక్టును నిర్మించారు. అప్పటి నుంచి 1972 వరకు ప్రతి సంవత్సరం వానకాలం, యాసంగిలో వరి సాగుకు నీటిని వదిలేవారు. అయితే 1972లో వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రాజెక్టులో చుక్క నీరు లేకుండా పూర్తిగా ఎండిపోయింది. ఇక అప్పటి నుంచి అడపాదడపా రెండు, మూడు సంవత్సరాలకు ఒకసారి రెండు సీజన్లకు నీటిని వదులగా 1982 నుంచి కేవలం ఒక్క సీజన్కు మాత్రమే సాగునీటిని అందిస్తూ వచ్చారు.
డిండి పూర్తిగా వర్షాధార ప్రాజెక్టు కావడం, ప్రాజెక్టు పరీవాహక ప్రాంత రైతులు తమ పొలాల్లో వరద కట్టలు వేయడంతో క్రమంగా ప్రాజెక్టులోకి వరద నీటి రాక తగ్గిపోయింది. దాంతో ఒక్కోసారి వానకాలంలో ఆయకట్టులో వేసిన వరి పొలానికి కూడా సరిగా నీరందక చివరి భూముల్లోని వరి చేలు ఎండిపోయేవి. రైతుల విజ్ఞప్తి మేరకు 1996లో ప్రాజెక్టు ఎత్తును మూడు అడుగులు పెంచి నీటి నిల్వ సామర్ధ్యాన్ని 2.45 టీఎంసీలకు పెంచారు. అయినా ప్రాజెక్టు నిండక పోవడంతో ఆయకట్టు కింద మూడేండ్లకు ఒకసారి మాత్రమే పూర్తిస్థాయిలో పంటలు సాగు చేసేవారు.
కేఎల్ఐతో మహర్దశ
డిండి ప్రాజెక్టు పరీవాహక ప్రాంతాల్లోని పొలాలకు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించడంతో డిండి ప్రాజెక్టుకు మహర్దశ చేకూరింది. పరీవాహక ప్రాంతంలో సాగు చేసిన పొలాల్లోని సీపేజీ నీరు డిండి వాగులోకి చేరుతుండడంతో మూడు సంవత్సరాలుగా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుతున్నది. ఈ ఏడు వానకాలంలోనే ప్రాజెక్టులోకి కేఎల్ఐ నీరు వచ్చి చేరడంతో పూర్తిస్థాయిలో నిండి అలుగు పోసింది. దాంతో ప్రాజెక్టు ఆయకట్టుకు వానకాలం, యాసంగిలో కూడా వరి సాగుకు సరిపోను నీటిని అందిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డిండి ఎత్తిపోతల పథకం పూర్తయితే ఆయకట్టుకు శాశ్వతంగా రెండు పంటలకు సాగునీరు లభించనుంది.